ముంబైని వీడని పరాజయాలు.. ఆరో మ్యాచ్‌లోనూ ఓటమి

ABN , First Publish Date - 2022-04-17T01:18:56+05:30 IST

ఐపీఎల్‌లో ముంబై పరాజయాల బాటను వీడడం లేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇక్కడి బ్రాబౌర్న్

ముంబైని వీడని పరాజయాలు.. ఆరో మ్యాచ్‌లోనూ ఓటమి

ముంబై: ఐపీఎల్‌లో ముంబై పరాజయాల బాటను వీడడం లేదు. లక్నో సూపర్ జెయింట్స్‌తో ఇక్కడి బ్రాబౌర్న్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మరోమారు ఓటమి పాలైంది. ఫలితంగా ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఓడిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.


చివరి ఓవర్‌లో ముంబై విజయానికి 26 పరుగులు అవసరం కాగా, క్రీజులో పొలార్డ్ ఉండడంతో సాధ్యమేనని భావించారు. అయితే, చమీర వేసిన చివరి ఓవర్ తొలి బంతికి ఉనద్కత్ (14) రనౌటయ్యాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన మురుగన్ అశ్విన్ తొలి బంతినే సిక్స్‌గా మలిచి ముంబై శిబిరంలో ఆశలు పెంచాడు. అయితే, ఆ తర్వాతి బంతికే రనౌట్ అయ్యాడు. దీంతో ముంబై ఆశలు అడుగంటాయి. పొలార్డ్ ఎదుర్కొన్న నాలుగో బంతికి పరుగులేమీ రాలేదు. ఐదో బంతిని సిక్సర్‌గా మలిచే యత్నంలో డీప్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మిల్స్ ఎదుర్కొన్న చివరి బంతికి పరుగులేమీ రాలేదు. దీంతో ముంబై ఇన్నింగ్స్ 181/9 వద్ద ముగిసింది. ఫలితంగా లక్నో 18 పరుగుల తేడాతో గెలిచి నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


కీలక మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (6) దారుణంగా విఫలమయ్యాడు. డెవాల్డ్ బ్రెవిస్ 31, సూర్యకుమార్ యాదవ్ 37, తిలక్ వర్మ 26, కీరన్ పొలార్డ్ 25 పరుగులు చేశారు. లక్నో బౌలర్లలో అవేశ్ ఖాన్‌కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ అజేయ సెంచరీ (103)తో అదరగొట్టగా డికాక్ 24, మనీష్ పాండే 38 పరుగులు చేశారు.

Updated Date - 2022-04-17T01:18:56+05:30 IST