ప్రేమికుల దినోత్సవాన విషాదం
ABN , First Publish Date - 2020-02-15T15:53:48+05:30 IST
లోకమంతా ప్రేమ మైకంలో మునిగిపోయిన వేళ.. ప్రేమికులొక్కటై తీపి బాసలతో...
ప్రేమను గెలుచుకోలేక.. యువతి, యువకుడు ఆత్మహత్య
కుప్పం/శ్రీకాళహస్తి అర్బన్: లోకమంతా ప్రేమ మైకంలో మునిగిపోయిన వేళ.. ప్రేమికులొక్కటై తీపి బాసలతో ఊసులాడుకునే పూట.. ప్రేమను గెలుచుకోలేక ఓ యువతి, యువకుడు అర్ధంతరంగా ప్రాణం తీసుకున్నారు. ఈ విషాద ఘటనలు ఒకటి కుప్పంలో, మరొకటి శ్రీకాళహస్తిలో చోటు చేసుకున్నాయి. కుప్పం మండలం తంబిగానిపల్లెకు చెందిన చిన్నదొరై, లలితల కుమార్తె స్వాతి (25)కి, అదే గ్రామానికి చెందిన ఒక యువకునికి మధ్య కొంతకాలంగా ప్రేమ నడుస్తోంది. వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. పైగా స్వాతికి మరొకరితో వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు నిశ్చయించారు.
ప్రేమను గెలుచుకోలేని స్వాతి, శుక్రవారం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు స్వాతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీనిపై ఎస్ఐ నరేంద్ర మాట్లాడుతూ స్వాతి తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారన్న కారణంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.
ప్రియురాలు దక్కదని..
ప్రేమ విఫలం అయిందన్న మనస్తాపంతో సుభాష్(21) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శుక్రవారం శ్రీకాళహస్తి శివారులోని శ్రీరామ్నగర్కాలనీ సమీపంలో వెలుగు చూసింది. శ్రీకాళహస్తి 1వ పట్టణ సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు... కోల్కతాకు చెందిన సుభాష్ సెంట్రింగ్ కూలీ. సొంతూరులో ఓ యువతిని ప్రేమించాడు. తరచూ ఆమెతో ఫోనులో సంభాషిస్తూ ఉండేవాడు. అయితే ఆమెకు మరొకరితో వివాహం నిశ్చయమైనట్లు గురువారం ఫోన్ ద్వారా తెలుసుకున్నాడు. దీంతో మనస్తాపం చెందిన సుభాష్ శ్రీరామ్నగర్కాలనీ సమీపంలో ఓ మిత్రుడి టైల్స్ గోదాములో రాత్రి ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి కాల్లిస్టు ఆధారంగా ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.