పట్టపగలు ప్రేమ జంట కిడ్నాప్‌

ABN , First Publish Date - 2021-08-06T08:59:43+05:30 IST

హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే పట్టపగలు ఓ ప్రేమ జంటను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.

పట్టపగలు ప్రేమ జంట కిడ్నాప్‌

పెళ్లి చేసుకునేందుకు ఆర్యసమాజ్‌కు  ప్రేమికులు

స్నేహితుల కళ్ల ముందే దుండగుల దాడి 

అనంతరం కారులోకి ఎక్కించుకొని పరార్‌

మద్దూరు పోలీసుల అదుపులో దుండగులు 


మంగళ్‌హాట్‌, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోనే పట్టపగలు ఓ ప్రేమ జంటను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. పెళ్లి చేసుకునేందుకు నగరానికి వచ్చిన ప్రేమికులను నడిరోడ్డు మీదే స్నేహితుల ఎదుటే వారిపై దాడి చేసి కిడ్నాప్‌ చేశారు. సుల్తాన్‌ బజార్‌ పోలీసుల వివరాల ప్రకారం... మహబూబ్‌నగర్‌ జిల్లా మధూర్‌ మండలం బండగొండ గ్రామానికి చెందిన శివశంకర్‌ (23), అదే జిల్లా నిర్జింత ప్రాంతానికి చెందిన హర్షితా రెడ్డి (21) మహబూబ్‌నగర్‌లో డిగ్రీ చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. వీరిద్దరి కులాలు వేర్వేరు కావడంతో ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.


ప్రేమికులిద్దరూ ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకునేందుకు గురువారం నగరానికి వచ్చారు. బీహెచ్‌ఈఎల్‌లో నివాసం ఉంటున్న తమ స్నేహితులను పెళ్లికి పిలిచారు. ఉదయం 11 గంటల సమయంలో ఆర్య సమాజ్‌ వద్దకు చేరుకున్నారు. ఇంతలో ఓ కారులో ఎనిమిది మంది యువకులు ఆర్య సమాజ్‌ వద్దకు చేరుకొని ప్రేమికులిద్దరిపై దాడి చేశారు. అనంతరం వారిని తమ కారులో బలవంతంగా ఎక్కించుకుని పరారయ్యారు. దీంతో ప్రేమికుల స్నేహితులు సుల్తాన్‌ బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలించారు. ఈ విషయాన్ని మద్దూరు మండల పోలీసులకు తెలపడంతో వారు గాలించి మద్దూరు వద్ద దుండగులను అదుపులోకి తీసుకున్నారు. వారి వెంట ఉన్న ప్రేమికులను విడిపించారు. ప్రస్తుతం ఇరు పక్షాల వారిని మద్దూరు పోలీస్‌ స్టేషన్‌లో ఉంచారు.

Updated Date - 2021-08-06T08:59:43+05:30 IST