ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని.. కత్తితో దాడి
ABN , First Publish Date - 2020-05-26T16:10:19+05:30 IST
తనను పెళ్లిచేసుకోకుంటే ఇద్దరం చనిపోదామంటూ..
యువతి ఆత్మహత్యాయత్నం
చల్లపల్లి(కృష్ణా): తనను పెళ్లిచేసుకోకుంటే ఇద్దరం చనిపోదామంటూ ప్రియుడిపై యువతి కత్తితో దాడిచేసి అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వక్కలగడ్డలో సోమవారం జరిగింది. బందరులోని ఇంగ్లీష్పాలెం యువతి ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తోంది. గూడూరు గొరిపర్తి పవన్ కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. ఇద్దరికీ రెండేళ్లుగా పరిచయం ఉంది. తనను వివాహం చేసుకోవాలని యువతి ప్రతిపాదించగా, ఇంటిలో ఒప్పుకోరని తిరస్కరించినట్లు పవన్ కుమార్ చెబుతున్నాడు.
యువతి తనకు తెలిసిన వారి ద్వారా వక్కల గడ్డలో గది అద్దెకు తీసుకుంది. ఇద్దరం మాట్లాడుకుందాం రావాలని పిలవడంతో పవన్కుమార్ వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి గొడవ పడిందని, తాను ఒప్పుకోకపోవటంతో నిన్ను చంపి నేను చచ్చిపోతానంటూ ఒక్కసారిగా కత్తితో దాడికి దిగిందని పవన్కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ తర్వాత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు ఇద్దరినీ చల్లపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అపస్మారక స్థితిలో ఉన్న యువతిని మచిలీపట్నం తరలించారు. ఎస్సై పి.నాగరాజు, సీఐ ఎన్.వెంకట నారాయణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.