నీ భర్తను వదిలేయ్.. నాతో వచ్చెయ్.. ఇదీ ఓ వ్యక్తి ప్రపోజల్.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2021-11-09T15:42:41+05:30 IST

దేశంలో స్త్రీలపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

నీ భర్తను వదిలేయ్.. నాతో వచ్చెయ్.. ఇదీ ఓ వ్యక్తి ప్రపోజల్.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

దేశంలో స్త్రీలపై అకృత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా దేశరాజధాని ఢిల్లీలో ఇటువంటి ఒక అమానుష ఘటన చోటుచేసుకుంది. బవానా ప్రాంతానికి చెందిన ఒక యువకుడు ఒక మహిళ విషయంలో ఎంత దారుణంగా ప్రవర్తించాడో తెలిస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు. 23 ఏళ్ల ఆ యువకుడు మాయ మాటలు చెప్పి ఆ మహిళను తన గదికి రమ్మన్నాడు. తరువాత ఆమెను తాడుతో కట్టేసి, ఆమెపై యాసిడ్ పోశాడు. ఆ తరువాత బీహార్‌కు పరారయ్యాడు. 26 ఏళ్ల ఆ బాధితురాలు ప్రస్తుతం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడు మోంటూను బీహార్ లోని బక్సర్‌లో అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తీసుకువచ్చారు. నిందితుని నుంచి ఒక మారణాయుధాన్ని పోలీసుల బృందం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉండగా, నిందితుడు వారిపై కాల్పులు జరిపాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఎదురు కాల్పులు జరిపారు.


 ఈ ఘటనలో నిందితుడు మోంటూ కాలికి గాయమయ్యింది. దీంతో పోలీసులు అతనిని ఆసుపత్రికి తరలించారు. ఈ కేసు గురించి పోలీసు అధికారి ఒకరు మీడియాకు వివరాలు వెల్లడించారు. బీహార్‌లోని బక్సర్ ప్రాంతానికి చెందిన షాలూ(26)(మార్చిన పేరు) తన భర్తతో పాటు బవానాలో ఉంటోంది. ఆమె భర్త ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తుంటాడు. షాలూకు పెళ్లికి ముందు మోంటూతో పరిచయం ఉంది. వారిద్దరూ కలసి మాట్లాడుకునేవారు. ఆ తరువాత షాలూకు వేరొకరితో వివాహం అయ్యింది. దీంతో ఆమె ఢిల్లీలో భర్తతో పాటు ఉంటోంది. అయితే షాలూని మరిపోలేని మోంటూ వారు ఉంటున్న ఇంటి పక్కనే గది తీసుకుని ఉండసాగాడు. ఒక రోజు షాలూ భర్త బయటికి వెళ్లడాన్ని గమనించిన మోంటూ ఇదే తగిన సమయమని షాలూను తన గదికి ఆహ్వానించాడు. భర్తను వదిలేసి తనతో వచ్చేమని ప్రపోజ్ చేశాడు. దీనికి షాలూ నిరాకరించడంతో మోంటూ ఆమెను తాళ్లతో బంధించి, ఆమెపై యాసిడ్ దాడి చేశాడు. తరువాత నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో షాలూ ముఖంతో పాటు శరీరంలోని కొన్ని భాగాలు కాలిపోయాయి. పోలీసుల విచారణలో మోంటూ అనే విషయాలు తెలిపాడు. షాలూ భర్తను అంతమొందించేందుకు ఒక తపంచా కూడా కొనుగోలు చేశాడు. కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-11-09T15:42:41+05:30 IST