కుటుంబంలో చిచ్చు రేపిన ప్రేమ పెళ్లి

ABN , First Publish Date - 2022-02-19T15:44:45+05:30 IST

నాగపట్టణంలోని ఓ కుటుంబంలో ప్రేమ పెళ్లి రేపిన చిచ్చు నలుగురిని బలిగొంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు, నాగపట్టణంలోని పుదుచ్చేరి గ్రామానికి చెందిన లక్ష్మణన్‌ టీ దుకాణం నడుపుతూ జీవనం

కుటుంబంలో చిచ్చు రేపిన ప్రేమ పెళ్లి

                     - భార్యా, ఇద్దరు కుమార్తెల హత్య, భర్త ఆత్మహత్య


ప్యారీస్‌(చెన్నై): నాగపట్టణంలోని ఓ కుటుంబంలో ప్రేమ పెళ్లి రేపిన చిచ్చు నలుగురిని బలిగొంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు, నాగపట్టణంలోని పుదుచ్చేరి గ్రామానికి చెందిన లక్ష్మణన్‌ టీ దుకాణం నడుపుతూ జీవనం సాగించేవాడు. అతడి భార్య భునవేశ్వరి (45). వీరికి ధనలక్ష్మి (21) వినోదిని (18), అక్షయ (15) అనే కుమార్తెలున్నారు. వినోదిని కళాశాల విద్య, అక్షయ ప్లస్‌ టూ చదువుకుంటోంది. ఈ నేపథ్యంలో, శుక్రవారం ఉదయం రోజులాగే లక్ష్మణన్‌ నడుపుతున్న టీ దుకాణానికి టీ తాగేందుకు వెళ్లిన స్థానికులు చాలాసేపటి  వరకు దుకాణం తెరవకపోవడంతో ఇంటి తలుపులు తట్టారు. పలుమార్లు తలుపులు తట్టినా లోపలి నుంచి సమాధానం లేకపోవడంతో అనుమానించిన స్థానికులు, కిటికీ నుంచి ఇంట్లో చూడగా, లక్ష్మణన్‌ ఉరేసుకుని శవంగా వేలాడుతుండడం చూసి దిగ్ర్భాంతి చెందారు. అతడి భార్య, ఇద్దరు కుమార్తెలు రక్తపు మడుగులో శవాలు గా పడివుండడం చూసి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ జవహర్‌ ఉత్తర్వుల మేరకు సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, నాలుగు మృతదేహాలు స్వాధీనం చేసుకొని నాగపట్టణం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదుచేసుకొని జరిపిన ప్రాథమిక విచారణలో, లక్ష్మణన్‌ పెద్ద కుమార్తె ధనలక్ష్మి తల్లిదండ్రుల వ్యతిరేకతను ఉల్లంఘించి అదే గ్రామానికి చెందిన విమల్‌రాజ్‌ను ప్రేమించి వివాహం చేసుకొని, ఇంటి నుంచి వెళ్లిపోయిందని, అప్పటినుంచి ఆమె తల్లిదండ్రులు మనోవేదనతో ఉన్నట్లు తెలిసింది. గురువారం రాత్రి ఇంట్లో నిద్రపోతున్న సమయంలో భార్య, ఇద్దరు పిల్లలను హత్యచేసిన లక్ష్మణన్‌ తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.

Updated Date - 2022-02-19T15:44:45+05:30 IST