జోరుగా అక్రమ దందా!
ABN , First Publish Date - 2021-05-17T05:56:40+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని గ్రామాల్లో బెల్టుషాపుల దందా జోరందుకున్నది.
లాక్డౌన్లో ఊపందుకున్న మద్యం విక్రయాలు
గ్రామాల్లో వాడవాడలా వెలుస్తున్న బెల్టుషాపులు
ఒక్కో క్వార్టర్పై అదనంగా రూ. 50 వసూలు
బెల్టుషాపు నిర్వాహకులకు వైన్స్ యజమానుల అండదండలు
అక్కన్నపేట, మే 16: లాక్డౌన్ నేపథ్యంలో అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని గ్రామాల్లో బెల్టుషాపుల దందా జోరందుకున్నది. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ అక్రమార్కులకు వరంగా మారింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తున్నారు. పదిరోజుల పాటు లాక్డౌన్ అని ప్రకటించగానే మద్యం దుకాణాల్లో స్టాక్ అంతా హాట్కేకుల్లా అమ్ముడపోయింది. బెల్టుషాపుల నిర్వాహకులు కూడా భారీగానే మద్యం కొనుగోలు చేశారు. అయితే ఉదయం 6 నుంచి 10 గంటలకు లాక్డౌన్ సడలించారు. ఇదే అదునుగా భావించిన హుస్నాబాద్లోని వైన్షాపు యజమానులు అక్రమదందాకు తెరలేపుతున్నారు. పట్టణంలో ఏడు వైన్స్షాపులున్నాయి. ఆ షాపుల యజమానులు సిండికేట్గా ఏర్పడి బెల్టుషాపుల నిర్వాహకులకు మద్యం విక్రయించేందుకు ప్రత్యేకంగా అక్కన్నపేట రోడ్డులోని ఒక వైన్స్ను కేటాయించుకున్నారు. ఈ షాపులో ఒక్కో క్వార్టర్కు రూ.20 చొప్పున ఎక్కువగా వసూలు చేస్తూ అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లోని బెల్టుషాపుల నిర్వాహకులకు మద్యం విక్రయిస్తున్నారు. ఉదయం 10 గంటల తర్వాత మూసివేయడంతో మందుబాబులు బెల్టుషాపుల నిర్వాహకులను ఆశ్రయిస్తున్నారు. దీంతో గ్రామాల్లో వెలిసిన బెల్టుషాపుల్లో మందుబాబులకు ఎప్పుడంటే అప్పుడు మద్యం దొరుకుతుంది. బెల్టుషాపుల నిర్వాహకులు సైతం ఒక్కో క్వార్టర్, బీరుపై రూ.50 కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారు.
లాక్డౌన్కి ముందు ఒక్కో గ్రామంలో 3 లేదా 4 బెల్టుషాపులు ఉండేవి. కరోనా, లాక్డౌన్ వల్ల దాదాపు 10కి పైగానే బెల్టుషాపులు వెలిశాయి. బెల్టుషాపులనిర్వాహకులకు వైన్స్ యజమానుల అండదండలు పుష్కలంగా ఉన్నా యి. పోలీసులు బెల్టుషాపులపై దాడులు చేస్తుంటే వారికి క్షణాల్లో ఫోన్లు వస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఈవిషయమై హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ విజయలక్ష్మిని వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.