‘నోషనల్’ ప్రకటనతో ఉద్యోగులకు నష్టం

ABN , First Publish Date - 2021-03-31T05:42:45+05:30 IST

గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రాగానే రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామనీ, ఉద్యోగ పదవీ విరమణ...

‘నోషనల్’ ప్రకటనతో ఉద్యోగులకు నష్టం

గత ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి రాగానే రాష్ట్ర ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తామనీ, ఉద్యోగ పదవీ విరమణ వయసును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పొడిగిస్తామనీ ప్రకటించింది. ఈ వాగ్దానాన్ని నమ్మి ఉద్యోగులందరూ టీఆర్‍ఎస్ గెలుపునకు కృషి చేశారు. అయితే ఎన్నెన్నో విన్నపాలు, వినతి పత్రాలు, ధర్నాల తర్వాత కూడా ప్రభుత్వం ఈ వాగ్దానాల అమలును వాయిదా వేస్తూనే వచ్చింది. చివరకు ఇటీవల (22-03–-2021 రోజున) ముఖ్యమంత్రి స్వయానా అసెంబ్లీలో 11వ పీఆర్సీ అమలపైన, పదవీ విరమణ వయోపరిమితి పెంపుపైన ప్రకటన చేశారు. అయితే పీఆర్సీ అమలుకు సంబంధించి 33 నెలల్లో కేవలం 12 నెలల కాలానికి మాత్రమే బకాయిలు చెల్లిస్తామనీ, దాదాపు రెండు సంవత్సరాల కాలాన్ని ‘నోషనల్’గా వర్తింపజేస్తామనీ తెలిపారు. అట్టి కాలానికి జులై 2018 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతారు. సర్వీసులో ఉన్న ఏ ఉద్యోగికైనా జీతం చెల్లించటం ప్రభుత్వం బాధ్యత. 33 నెలల ఆర్థిక సదుపాయాన్ని కేవలం 12 నెలలకు కుదించటం ఎంతవరకు న్యాయం? రెండు సంవత్సరాల లబ్ధిని ఎందుకు పోగొట్టుకోవాలి? ఎందుకు నష్టపోవాలి? 


పదవీ విరమణ వయోపరిమితి పెంపును కూడా ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు అధికారంలోకి రాగానే ప్రకటించి ఉంటే కొందరు ఉద్యోగులకు ఫిబ్రవరి 2021లోపు పదవీ విరమణ పొందినవారికి ప్రమోషన్లు వర్తించేవి. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సగటు ఉద్యోగిని దృష్టిలో ఉంచుకొని మానవతా కోణంలో ఆలోచించాలి. ప్రభుత్వం అమలు పరిచే ప్రతి పథకాన్నీ క్షేత్రస్థాయికి తీసుకెళ్ళేది సంఘాల రాష్ట్ర నాయకులు కాదనీ, సగటు ఉద్యోగేనన్న వాస్తవాన్ని గ్రహించాలి.

బి. బాలు, హైదరాబాద్

Updated Date - 2021-03-31T05:42:45+05:30 IST