లారీ ఢీకొని కార్మికుడి మృతి
ABN , First Publish Date - 2022-05-23T06:06:38+05:30 IST
చినవాల్తేరు కనకమ్మవారివీధిలో లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పింది.
బ్రేక్లు ఫెయిలవ్వడంతో ఇళ్లలోకి దూసుకుపోయిన వాహనం
మద్దిలపాలెం, మే 22: చినవాల్తేరు కనకమ్మవారివీధిలో లారీ బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పింది. దీంతో నడుస్తూ వెళుతున్న భవన నిర్మాణ కార్మికుడిని లారీ ఢీకొని నివాసాల వైపు దూసుకువెళ్లింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సహాయంతో లారీని బయటకు తీశారు. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చినవాల్తేరు పీతలవీధికి చెందిన ఎ.రామారావు (24) భవన నిర్మాణాలకు రాడ్డు బెండింగ్ పనులు చేస్తుంటాడు. ఉదయం ఇంటికి వెళ్లడానికి కనకమ్మవారివీధిలో నడుస్తూ వెళుతుండగా చినవాల్తేరులో మట్టి ఎత్తడానికి వెళుతున్న లారీకి బ్రేకులు ఫెయిల్ అవడంతో అదుపు తప్పింది. పక్కనే వున్న వాహనాన్ని లారీ డ్రైవర్ తప్పించబోయి రామారావును ఢీకొట్టి ఇళ్లలోకి దూసుకుపోవడంతో ఆగింది. దీంతో రామారావు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.