సంభవామి యుగే యుగే!
ABN , First Publish Date - 2020-09-04T05:30:00+05:30 IST
ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతీ యుగంలో జన్మిస్తూనే ఉంటానని భగవద్గీత నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ...
ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతీ యుగంలో జన్మిస్తూనే ఉంటానని భగవద్గీత నాలుగో అధ్యాయం ఎనిమిదో శ్లోకంలో చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ.
- పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్
- ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే!
‘‘అర్జునా! మంచి వారిని రక్షిస్తాను, చెడ్డవారిని శిక్షిస్తాను. ధర్మసంస్థాపన కోసం ప్రతియుగంలో జన్మిస్తాను’’ అని చెప్పాడు శ్రీకృష్ణపరమాత్మ. త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపర యుగంలో కృష్ణుడిగా జన్మించాడు. కలియుగంలో కల్కి అవతారంగా జన్మిస్తాడు. ఇక్కడ అవతారాల ఆంతర్యాన్ని గమనించండి. మొదట మత్య్సావతారం. పూర్తిగా నీటిలో ఉండే జీవి. ఈ అవతారంలో సోమకాసురుణ్ణి సంహరించి, వేదాలను రక్షించాడు. సోమకాసురుడు వేదాలను తీసుకెళ్ళి నీటిలో పెట్టాడు. అందుకే భగవంతుడు మత్స్యావతారం ఎత్తాడు. సమూహ శక్తి, సామాజిక శక్తిలో నుంచి భగవంతుడి అవతారం పుడుతుంది. తరువాత కూర్మావతారం, వరాహావతారం, నారసింహావతారం. ఐదో అవతారం వామనమూర్తి. ఆరో అవతారం పరశురామ అవతారం. ఏడో అవతారం పరిపూర్ణ మానవావతారం రామావతారం. ఆ తరువాత శ్రీకృష్ణావతారం. చివరగా తొమ్మిదోది బుద్ధుని అవతారం.
ఇక కల్కి అవతారం. ఢిల్లీలో నిర్భయ ఘటన జరిగినప్పుడు ప్రజలందరూ నినదిస్తూ వీధుల్లోకి వచ్చారు. దాని మూలంగా నిర్భయ చట్టం రూపుదిద్దుకుంది. ఆ సామూహిక శక్తే భగవంతుడు. అదే కల్కి అవతారం!
- గరికిపాటి నరసింహారావు