కరోనా నుంచి కోలుకున్నాక కంటి చూపు మందగిస్తుందా?
ABN , First Publish Date - 2021-06-13T17:33:05+05:30 IST
దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కాస్త నెమ్మదిస్తోంది.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కాస్త నెమ్మదిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా తగ్గుముఖం పడుతోంది. అయితే కరోనా నుంచి కోలుకున్నవారు పలు ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. కరోనా నుంచి కోలుకున్నవారు పూర్తి ఆరోగ్యవంతులు అయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి సమస్యలను వైద్యులు లాంగ్ కోవిడ్గా పేర్కొంటున్నారు.
కరోనా నుంచి కోలుకున్న అనంతరం బాధితుల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి ఢిల్లీలోని మణిపాల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ వనులి వాజ్పేయి మీడియాతో ప్రస్తావించారు. కరోనా నుంచి కోలుకున్న పలువురు కంటి సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతున్నారన్నారు. నిజానికి కోవిడ్ సోకిన సమయంలోగానీ కోలుకున్నతరువాత గానీ కళ్లకు ఎటువంటి నష్టం వాటిల్లదని తెలిపారు. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది కండ్ల కలకలు వస్తున్నాయని చెబతున్నారని, ఇది పెద్ద సమస్య కాదని డాక్టర్ వాజ్పేయి తెలిపారు. అయితే కొన్ని సందర్భాల్లో కంటిలోని రెటీనాపై వైరస్ ప్రభావం చూపుతుందని, ఫలితంగా కంటి చూపు కోల్పోయేందుకు కూడా అవకాశాలుంటాయని అన్నారు. ఇటువంటి సమస్యలు తలెత్తినపుడు వెంటనే కంటి వైద్యులను సంప్రదించాలని డాక్టర్ వాజ్పేయి సూచించారు.