ఏకాంతంగా భాగ్‌సవారి

ABN , First Publish Date - 2021-10-17T07:55:54+05:30 IST

శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శనివారం సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు.

ఏకాంతంగా భాగ్‌సవారి
శ్రీవారికి హారతి ఇస్తున్న అర్చకుడు

తిరుమల, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో శనివారం సాయంత్రం భాగ్‌సవారి ఉత్సవం ఏకాంతంగా నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటిరోజు భాగ్‌సవారి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని.. అనంతాళ్వారు అశ్వత్త వృక్షానికి బంధిస్తాడు. స్వామివారిని పట్టుకోబోగా.. అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలోకి వెళ్లి మాయమవుతారు. ఆ తర్వాత తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసినది సాక్షాత్తూ స్వామివారేనని అనంతాళ్వారులు గ్రహించి పశ్చాత్తాపం చెందుతారు. వెంటనే అమ్మవారిని బందీ నుంచి విముక్తి కల్పించి, పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరుస్తాడు. తన భక్తుడి భక్తికి మెచ్చి స్వామి అతడి కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి, తిరిగి ఆలయంలోకి ప్రవేశిస్తానని అభయమిచ్చారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ భాగ్‌సవారి ఉత్సవంలో భాగంగా సాయంత్రం నాలుగు గంటలకు మలయప్పస్వామి ఆలయంలోని రంగనాయకుల మండపంలోకి వేంచేపు చేశారు. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు నాళాయర దివ్య ప్రబంధం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమే్‌షబాబు, ఓఎస్డీ శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-17T07:55:54+05:30 IST