తానా ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు

ABN , First Publish Date - 2020-08-06T21:03:28+05:30 IST

అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధర్యంలో 40 పైచిలుకు దేశాలలో ఉన్న 100కు

తానా ఆధ్వర్యంలో ఘనంగా ముగిసిన ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహోత్సవాలు

హాజరైన లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాశ్ నారాయణ, తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్


డాలస్: అమెరికాలోని ప్రముఖ తెలుగు సంస్థ తానా ఆధర్యంలో 40 పైచిలుకు దేశాలలో ఉన్న 100కు పైగా తెలుగు సంఘాలు కలిసి గత పది రోజులగా నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవాలు రెండో తేదీ సాయంత్రం ముగిశాయి. గత నెల జులై 24వ తేదీన భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభమయి పదిరోజుల పాటు ఉత్సవ వాతావరణంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వెబ్-ఎక్స్ ఆన్లైన్ ద్వారా నిర్వహించిన ఈ సమారోహ సంబరాలకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి అధ్యక్షత వహించగా..  శ్రీమతి శిరీష తూనుగుంట్ల సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ ముగింపు సమావేశంలో పాల్గొన్న లోక్‌సత్తా పార్టీ జాతీయ అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ, తెలంగాణ సాంస్కృతిక శాఖామాత్యులు శ్రీనివాస్ గౌడ్, డి.ఆర్.డి.వో చైర్మన్ సతీష్ రెడ్డి, జి.ఎం.ఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లిఖార్జున రావు మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఇటువంటి కార్యక్రమం రూపాందించడం, సాంస్కృతిక పోటీలలో 18 వేల మంది తెలుగు వారు ప్రపంచ వ్యాప్తంగా పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఆపద సమయాన్ని తెలుగు వారు ఉపయోగంగా మలచుకొని ఎలా ముందుకెళతారో మరోమారు నిరూపించారని అన్నారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించినందుకు తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరిని, మహిళా విభాగ కో-ఆర్డినేటర్ శ్రీమతి శిరీష తూనుగుంట్లను ప్రశంసించారు. 


తెలుగు భాషకు, సంస్కృతికి ఈ ఉత్సవాలు గొప్ప భరోసాను ఇచ్చాయని, తెలుగు భాషకు ఏ ప్రమాదం రాదని ఈ ఉత్సవాలను చూసిన తరవాత అనిపించిందన్నారు. ప్రధాన అంశాలైన సౌందర్య లహరి, తెలుగు వెలుగు, రాగమంజరి, నాదామృతం, అందెలరవాలి, కళాకృతి, రంగస్థలం, భువన విజయం పోటీలలో నెగ్గిన విజేతల పేర్లను ప్రకటించారు. ఈ పోటీలలో వివిధ దేశాలకు చెందిన 485 మంది విజేతలుగా నిలిచారు. వారందరికీ బహుమతులు, సర్టిఫికెట్లు అందచేస్తున్నామని అన్నారు. 


కాగా.. సాయంత్రం 6 గంటలకు మొదలైన ముగింపు సంబరాలు మరునాడు ఉదయం 3 గంటల వరుకు కొనసాగాయి. ప్రపంచం నలు మూలల నుంచి వివిధ టైంజోన్స్‌కి చెందిన తెలుగు వారు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. అందరూ చాలా ఉత్సాహంతో పాల్గొనడం గమనించదగ్గ విషయం. వివిధ తెలుగు సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ.. ఈ ఉత్సవాలు ఒక మధురానుభూతిగా నిలిచిపోతాయని, వివిధ దేశాల్లో ఉన్నప్పటికి తానా  కృషి ఫలితంగా ఒకే వేదికపై కలుసుకునే అవకాశం వచ్చిందని అన్నారు. తెలుగు భాషను రక్షించుకోవడంలో తామంతా సైనికుల్లా పనిచేస్తామని ప్రకటించారు. ఈ సమావేశంలో జస్టిస్ వంగల ఈశ్వరయ్య, పద్మశ్రీ మల్లేశం, తానా పూర్వ అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి, రంగస్థల నటులు మీగడ రామ లింగ స్వామి, గుమ్మడి గోపాల కృష్ణ, తానా ప్రముఖలు శ్రీహరి కోయ, జయశేఖర్ తాళ్లూరి, భారతీయం సత్య వాణి తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. చివరగా అతిథులంతా ప్రతి సంవత్సరం ఇలాంటి ఉత్సవాలను నిర్వహించాలని కోరగా.. తానా అధ్యక్షుడు జయ తాళ్లూరి  "ఎల్లలులేని తెలుగు - ఎప్పటికి తెలుగు” అనే కార్యక్రమం కింద ఇలాంటి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాలను పురస్కరించుకొని 10 లక్షల రూపాయల విరాళాన్ని చేనేత  కార్మికుల కోసం పేద కళాకారుల కోసం ప్రకటించారు. చివరిగా శ్రీమతి శిరీష తూనుగుంట్ల వందన సమర్పణ చేశారు.

Updated Date - 2020-08-06T21:03:28+05:30 IST