లోకేశ్కు నీరా‘జనం’
ABN , First Publish Date - 2021-02-26T07:04:14+05:30 IST
నందిగామ పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఘన స్వాగతం లభించింది.
నందిగామ రోడ్ షోలో ఘన స్వాగతం
నందిగామ, ఫిబ్రవరి 25 : నందిగామ పట్టణంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్కు ఘన స్వాగతం లభించింది. నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఇంటి వద్ద వైసీపీకి చెందిన మహిళలు హడావిడి చేయడంతో ఆందోళనలో ఉన్న ఆమెను పరామర్శించేందుకు నందిగామ వచ్చిన ఆయనకు కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో ఎదురేగి స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి ఉదయం పది గంటల సమయంలో ఆయన సౌమ్య నివాసానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడకు చేరి ఉన్న టీడీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ఆయనపై పూల వర్షం కురిపించారు. సౌమ్యతో మాట్లాడిన అనంతరం కార్యకర్తలు ఆయన కాన్వాయ్ను అనుసరించారు. వీధుల వెంట కార్యకర్తలతో పాటు సామాన్య ప్రజానీకం కూడా ఆయన వాహన శ్రేణిని అనుసరించారు. మహిళలు, యువకులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఉత్సాహం చూపారు. రోడ్షో జరిగినంతసేపు ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.