సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ

ABN , First Publish Date - 2021-10-11T22:26:02+05:30 IST

సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు నారా లోకేష్ బహిరంగ లేఖ

అమరావతి: సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేష్ బహిరంగ లేఖ రాశారు. విద్యుత్ వినియోగ‌దారుల‌కు భారంగా మారిన పెంచిన‌ చార్జీలను త‌గ్గించాలన్నారు. ట్రూఅప్ చార్జీలు త‌క్షణ‌మే ఉప‌సంహ‌రించుకోవాలని సూచించారు. కుప్పకూలిన విద్యుత్‌ రంగాన్ని గాడిన పెట్టాల్సిన అత్యవ‌స‌రం గురించి.. ముఖ్యమంత్రి  మీరు ప్రతిప‌క్షనేత‌గా వున్నప్పుడు క‌రెంట్ చార్జీలు పూర్తిగా త‌గ్గించేస్తామ‌ని ప్రతీ స‌భ‌లో చెప్పిన విష‌యాలు ఇప్పటికీ జ‌నం చెవిలో మార్మోగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో ఒక్కసారి కూడా చార్జీలు పెంచ‌క‌పోయినా అస‌త్య ప్రచారం చేస్తూ బాదుడే బాదుడు అంటూ దీర్ఘాలు తీశారని చెప్పారు.  


ముఖ్యమంత్రిగా ప్రమాణ‌స్వీకారం చేసిన రోజున క‌రెంట్ చార్జీల గురించి, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల‌ గురించి చేసిన ప్రవ‌చ‌నాలు మీకు మాత్రమే సాధ్యమైన అబ‌ద్ధాల‌ని స్పష్టమైందన్నారు. రెండున్నరేళ్ల మీ పాల‌న‌లో ఇప్పటివ‌ర‌కూ 6 సార్లు విద్యుత్ చార్జీలు పెంచారని గుర్తుచేశారు. 7 వ సారి కూడా పెంచేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ ఐదేళ్ల పాల‌నలో మిగులు విద్యుత్‌తో నాణ్యమైన 24 గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా చేశామని చెప్పారు. మీరు వ‌చ్చిన నాటి నుంచి విద్యుత్ ఏ ఒక్కరోజూ స‌క్రమంగా స‌ర‌ఫ‌రా కాలేదని లేఖలో పేర్కొన్నారు. ఒకవైపు విద్యుత్ కోత‌లు-మ‌రోవైపు క‌రెంట్ బిల్లుల వాత‌లు సాధార‌ణ‌మైపోయాయని చెప్పారు. ఆరు విడ‌త‌ల్లో పెంచిన విద్యుత్ చార్జీల భారం 11,611 కోట్లంటే ఎంత‌గా భారం మోపారో అర్థం అవుతోందన్నారు. పేద‌ల ఇంటి ప్యూజులు పీకుతామ‌ని మ‌రీ బెదిరించి వ‌సూలు చేస్తున్న క‌రెంటు బిల్లుల ఆదాయం చాల‌క..


ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ద్వారా 26,261 కోట్లు అప్పులు తీసుకొచ్చారని లేఖలో పేర్కొన్నారు. ఈ భారాల‌న్నీ మ‌ళ్లీ విద్యుత్ వినియోగ‌దారుల‌పై ట్రూఅప్‌ ఛార్జీలు పేరుతో బాదేందుకు రంగం సిద్ధం చేయ‌డం చాలా అన్యాయన్నారు. ఒక బ‌ల్బు, ట్యూబ్‌లైట్‌, ఫ్యాన్ ఉంటేనే వంద‌ల నుంచి వేల‌ల్లో బిల్లు వ‌స్తుంటే.. దీనిపై మాత్రం అధికారుల నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ వివ‌ర‌ణ లేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ యూనిట్‌ ధర రూ.3.12లకే లభిస్తుంటే, మీరు యూనిట్ గ‌రిష్టంగా 20 రూపాయ‌ల‌కు ఎందుకు కొనుగోలు చేస్తున్నారో ప్రజ‌ల‌కు స‌మాధానం చెప్పాలని లేఖ ద్వారా డిమాండ్ చేశారు. యూనిట్‌కి అద‌నంగా పెడుతున్న 16 రూపాయ‌ల‌కు పైగా వస్తున్న సొమ్ము ఎవ‌రి జేబుల్లోకి వెళుతోంది? అని లోకేష్ ప్రశ్నించారు. అంతులేని మీ అవినీతిని త‌గ్గించుకుంటే పేద‌ల‌కు నాణ్యమైన విద్యుత్‌ని క‌రెంటు చార్జీలు పెంచ‌కుండానే అంద‌జేయొచ్చన్నారు. క‌రోనా క‌ష్టాలు, పెరిగిన ధ‌ర‌ల‌తో బ‌తుకు దుర్భర‌మైన సామాన్యుల‌కు మీ క‌రెంట్ చార్జీల దోపిడీ శ‌రాఘాతంలా త‌గులుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్‌లకు చెల్లించాల్సిన 12 వేల కోట్లు, ప్రభుత్వరంగ సంస్థలు చెల్లించాల్సిన 10,800 కోట్లు చెల్లిస్తే విద్యుత్ రంగం కుప్పకూలే దుస్థితి వ‌చ్చేది కాదన్నారు. వెంట‌నే ప్రభుత్వం బ‌కాయిలు చెల్లించేలా చ‌ర్యలు తీసుకుని సంక్షోభంలో ప‌డిన విద్యుత్‌రంగాన్ని కాపాడాలని లేఖ ద్వారా సూచించారు. ఇప్పటికే పెంచిన విద్యుత్ చార్జీల‌ను త‌గ్గించాలనన్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో మ‌రోసారి క‌రెంటు చార్జీలు పెంచే ప్రయ‌త్నాన్ని త‌క్షణ‌మే విర‌మించాలని సూచించారు.  

Updated Date - 2021-10-11T22:26:02+05:30 IST