జగన్రెడ్డి అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారు: లోకేష్
ABN , First Publish Date - 2022-04-28T18:06:52+05:30 IST
జగన్ రెడ్డి అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని లోకేష్ అన్నారు.
అమరావతి: జగన్ రెడ్డి అరాచక పాలనలో మహిళలు బయటకి రావాలంటేనే భయపడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గుంటూరు జిల్లాలో మహిళపై అత్యాచారం, హత్య ఘటనపై స్పందించిన ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ దాడికి గురైన ఒక యువతికి న్యాయం చేయాలని పోరాడుతుండగానే ఇంకో మహిళపై అఘాయిత్యం జరుగుతోందన్నారు. రేపిస్టులను ఉరి తియ్యాల్సిన ప్రభుత్వం బాధిత కుటుంబాలకు మద్దతుగా నిలిచేవారికి నోటీసులు ఇవ్వడం, కేసులు నమోదు చేయడం తాలిబన్ల పాలనని తలపిస్తోందన్నారు.
గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం, దుగ్గిరాల మండలం, తుమ్మపూడిలో మహిళపై హత్యాచారం దారుణమని లోకేష్ అన్నారు. సామూహిక అత్యాచారానికి పాల్పడి బలిగొన్న మృగాళ్లని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అత్యాచారాలు, హత్యలతో బరితెగించిన నిందితుల్ని ప్రభుత్వం చూసీచూడనట్లు వదిలేస్తుండడం వల్లే నేరగాళ్లు చెలరేగిపోతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఇప్పటివరకు 800 మందికిపైగా మహిళలపై అఘాయిత్యాలకి పాల్పడిన మానవమృగాళ్లలో ఒక్కరికైనా శిక్ష పడి వుంటే వారికి భయం పుట్టేదని లోకేష్ వ్యాఖ్యానించారు.