లోకేష్ జన్మదిన వేడుకలు ఉద్రిక్తం!
ABN , First Publish Date - 2021-01-24T05:25:46+05:30 IST
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన సంబరాలు కుప్పంలో ఉద్రిక్తంగా మారాయి.
పోలీసుల అభ్యంతరంతో టీడీపీ నేతల వాగ్వాదం
కుప్పం, జనవరి 23: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జన్మదిన సంబరాలు కుప్పంలో ఉద్రిక్తంగా మారాయి. లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని పూజలు, అన్నదానాలు, ర్యాలీలు, సమావేశాలతో కుప్పంలో టీడీపీ శ్రేణులు హోరెత్తించాయి.గంగమ్మ ఆలయంలో అభిషేకాల అనంతరం ఎన్టీఆర్ విగ్రహం వద్దకు ర్యాలీగా బయలుదేరగా అర్బన్ సీఐ శ్రీధర్, ఎస్ఐ నరేంద్ర అడ్డుకున్నారు. డప్పుల మోతలు, మైకుల్లో ప్రసంగాలు, పాటలు వెంటనే ఆపేయాలని, సభను త్వరగా ముగించాలని హుకుం జారీ చేశారు. ముందు వైసీపీ నాయకులు పట్టణంలో అడ్డంగా పెట్టిన ఫ్లెక్సీలు, ఆర్చిలు తొలగించి ఆపై తమ సంబరాల జోలికి వస్తే బాగుంటుందని టీడీపీ నేతలు చెప్పడంతో సీఐ ఆగ్రహానికి గురయ్యారు.ఒక దశలో ఇరు వర్గాల మధ్య వాదోపవాదాలు పెరిగి, ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆపైన జరిగిన బహిరంగ సభలో టీడీపీ నాయకులు విమర్శలకు దిగారు.పోలీసులు మంచివారేనని, వైసీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గడంవల్లే వారు ఈ తీరుగా వ్యవహరిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదన్నారు.అనంతరం పీఎస్.మునిరత్నం వంటి పెద్దలు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణుల ఆగ్రహావేశాలను చల్లార్చారు.