బ్యాంకింగ్ సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం
ABN , First Publish Date - 2020-09-17T06:18:53+05:30 IST
బ్యాంకింగ్ చట్టం (సవరణ) బిల్లు 2020కి లోక్సభ ఆమోదం తెలిపింది...
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ చట్టం (సవరణ) బిల్లు 2020కి లోక్సభ ఆమోదం తెలిపింది. పీఎంసీ బ్యాంకు సంక్షోభం నేపథ్యంలో సహకార బ్యాంకింగ్ వ్యవస్థ ప్రక్షాళనం లక్ష్యంగా ప్రభుత్వం జూన్ 26వ తేదీన జారీ చేసిన ఆర్డినెన్సు స్థానంలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దేశంలో సహకార బ్యాంకులకు కూడా ఆర్బీఐ పర్యవేక్షణను విస్తరించడానికే సవరణలు ప్రతిపాదించినట్టు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిల్లును ప్రతిపాదిస్తూ తెలిపారు. సహకార బ్యాంకుల పాలన మెరుగుపరిచి డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించేందుకు ఈ చర్య తీసుకున్నామని ఆమె చెప్పారు. ఈ ఏడాది మార్చి నాటికి సహకార బ్యాంకుల ఎన్పీఏలు 10 శాతం దాటిపోయి వాటి పరిస్థితి దారుణంగా మారిందని ఆమె తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 277 పట్టణ సహకార బ్యాంకులు నష్టా లు ప్రకటించాయని, కనీసం 100 బ్యాంకులు కనీస మూలధనం నిర్వహించలేని స్థితిలో ఉన్నాయని, 47 బ్యాంకుల నికర విలువ ప్రతికూలంగా మారిందని చెప్పారు. అయితే ఈ సవరణలు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలకు (పీఏసీఎస్) వర్తించవని మంత్రి తెలిపారు.