సామరస్య పరిష్కారమే శ్రేయస్కరం
ABN , First Publish Date - 2021-04-11T05:57:21+05:30 IST
సామరస్య పరిష్కారమే శ్రేయస్కరం
లోక్అదాలత్తో సమయం, డబ్బు ఆదా
జిల్లా ప్రధాన న్యాయమూర్తి హరిక్రిష్ణ భూపతి
ఇరు జిల్లాల్లో 2,844కేసులకు పరిష్కారం
ఖమ్మం లీగల్ ఏప్రిల్ 10: వివాదాల్లో సామరస్య పరిష్కారమే సమాజానికి శ్రేయస్కరమని న్యాయసేనాధికారసంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సీ. హరిక్రిష్ణ భూపతి పేర్కొన్నారు. జాతీయ లోక్అదాలత్ సందర్భంగా శనివారం ఖమ్మం న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపన్యసిస్తూ రాజీపడదగిన కేసులైన భార్య భర్తల కేసులు, కుటుంబ తగాదాలు, ఇరుగుపొరుగు వారికి సంబందించిన కేసులను లోక్అదాలత్ ద్యారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయనా, మనస్పర్ధలకు కూడా అవకాశం లేకుండా ఉంటుదని పేర్కొన్నారు. చిన్నచిన్న కేసులలో జాప్యం వల్ల వీటి ప్రభావం సమాజంపైపడి దుష్పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో నైతిక విలువలు పతనమయ్యాయని, వ్యక్తుల మధ్య ఆర్థిక సంబందాలే తప్ప హార్దిక సంబధాలు లేవన్నారు. రామాయణం మహభారతంలోనూ ముందు రాజీ ప్రయత్నం చేసిన తరువాతే యుద్దం జరిగిందన్నారు. రాజీ పడదగిన కేసుల పరిష్కారం ద్వారా కోర్టులపై పనిభారం తగ్గుతుందని న్యాయమూర్తి వివరించారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో మొత్తం 22 బెంచ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మంలో ఎనిమిది బెచ్లు ఏర్పాటు చేసినట్లుగా ఖమ్మం న్యాయసేవాదికార సంస్థ కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావిద్పాషా తెలిపారు. ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మలీదు నాగేశ్వరరావు మాట్లాడుతూ బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల తరుపున లోక్అదాలత్కు తాము పూర్తిగా సహకరిస్తామన్నారు. ఖమ్మం బార్అసోసియేషన్ ఆధ్వర్యంలో పులిహోర, తాగునీటి ప్యాకెట్లును జిల్లా న్యాయమూర్తి సీ. హరిక్రిష్ణ భూపతి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు వి. బాలభాస్కర్రావు, జానిరూత్, అరుణకుమారి, చంద్రశేఖర్ ప్రసాద్, ఆర్. తిరుపతి, మహ్మద్అఫ్రోజ్ అక్తర్, ఎన్. అనితారెడ్డి, ఎన్.శాంతిసోని, పి.మౌనిక, ఎన్విహెచ్ పూజిత, రుబీనా ఫాతీమా, ఎం. ఉషశ్రీ, న్యాయవాదులు, కక్షిదారులు హాజరయ్యారు. లోక్ అదాలత్ కేసులను గత పది రోజులుగా న్యాయమూర్తులు పరిష్కరిస్తున్నారు.
ఇరు జిల్లాల్లో 2,844 కేసుల పరిష్కారం
లోక్ అదాలత్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 2,844కేసులు పరిష్కరించారు. వీటిలో ఖమ్మంలో 1,115, కొత్తగూడెంలో 446, మధిరలో 197, సత్తుపల్లిలో 431, మణుగూరులో 179, భద్రాచలంలో 154, ఇల్లెందులో 322 కేసులను పరిష్కరించారు.