సమస్యల లోగిలి
ABN , First Publish Date - 2022-06-30T06:10:59+05:30 IST
లోగిలి వంతెనకు మోక్షం కలగడం లేదు. తుఫాన్కు కొట్టుకుపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు.
తుఫాన్కు వంతెన కొట్టుకుపోవడంతో ఇబ్బందులు
డుంబ్రిగుడ, జూన్ 29: లోగిలి వంతెనకు మోక్షం కలగడం లేదు. తుఫాన్కు కొట్టుకుపోయి ఏళ్లు గడుస్తున్నా మరమ్మతులకు నోచుకోవడం లేదు. అరకు సంతబయలు నుంచి ఒడిశా సరిహద్దుకు వెళ్లే మార్గంలో బొందుగుడ- కిల్లోగుడ వెళ్లే రోడ్డులో ఈ వంతెన ఉంది. ఈ వంతెన మీదుగా సాగర, కురిడి, కొర్రాయి పంచాయతీలకు చెందిన సుమారు 35 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే తుఫాన్కు ఈ వంతెన కొట్టుకుపోవడంతో తాత్కాలికంగా వంతెన పక్కన తూములు వేసి దానిపై రోడ్డు వేశారు. వర్షాలు కురవనప్పుడు ద్విచక్ర వాహనాలు, ఆటోల రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. కానీ భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోతాయి. ఆ సమయంలో వంతెన అటువైపు ఉన్న జైపూర్ జంక్షన్కు వెళ్లాలంటే 13 కిలో మీటర్లు అదనంగా ప్రయాణించాలి. దీని వల్ల ఈ ప్రాంతవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఈ వంతెన పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.