రాజస్థాన్ రాష్ట్రంలో మిడతల దండు దాడి
ABN , First Publish Date - 2020-06-06T11:32:27+05:30 IST
రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాపై మిడతల దండు దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.....
బార్మేర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మేర్ జిల్లాపై మిడతల దండు దాడి చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బార్మేర్ జిల్లా ఛోహటన్ గ్రామంలో మిడతల దాడిని అడ్డుకునేందుకు రైతులు స్టీలు ప్లేట్లతో చప్పుళ్లు చేశారు. తమ పంటలను మిడతల దాడి నుంచి కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. మిడతల దాడి నుంచి తమ పంటలను కాపాడాలని బార్మేర్ జిల్లా రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. అసలే కరోనా వైరస్ తో అవస్థలు పడుతున్న తమకు మిడతల దాడి ఆందోళన కలిగిస్తుందని రైతులు చెప్పారు.జైపూర్ ప్రాంతంలో ఇటీవల డ్రోన్ల సాయంతో మిడతల దండును తరిమేశారని, అలాగే తమ ప్రాంతంలోనూ వ్యవసాయాధికారులు మిడతల దాడిని నిరోధించాలని రైతులు కోరారు. మిడతల దాడిని అడ్డుకునేందుకు తాము డ్రోన్లను వినియోగిస్తామని రాజస్థాన్ వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ ఓం ప్రకాష్ చౌదరి చెప్పారు.