కొడుకు కోసం కన్నతల్లి సాహసం!

ABN , First Publish Date - 2020-04-10T06:31:39+05:30 IST

కొడుకు కోసం కన్న తల్లి పెద్ద సాహసమే చేసింది! లాక్‌డౌన్‌తో నెల్లూరు జిల్లాలో చిక్కుకున్న కుమారుడిని తీసుకొచ్చేందుకు స్కూటీపై ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణించింది.

కొడుకు కోసం కన్నతల్లి సాహసం!

లాక్‌డౌన్‌తో నెల్లూరులో చిక్కుకున్న కుమారుడు

స్కూటీపై 1400కి.మీ ప్రయాణం చేసిన తల్లి


బోధన్‌, ఏప్రిల్‌ 9: కొడుకు కోసం కన్న తల్లి పెద్ద సాహసమే చేసింది! లాక్‌డౌన్‌తో నెల్లూరు జిల్లాలో చిక్కుకున్న కుమారుడిని తీసుకొచ్చేందుకు స్కూటీపై ఏకంగా 1400 కిలోమీటర్లు ప్రయాణించింది. ఇన్ని ఆంక్షల మధ్య ఎన్నో ఇబ్బందులను భరిస్తూ కొడుకును తీసుకొచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌కు చెందిన రజియాబేగం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. 12 ఏళ్ల క్రితం భర్త మృతి చెందాడు. చిన్న కుమారుడు మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు కూడా బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో మార్చి 12న నిజాముద్దీన్‌ నెల్లూరు వెళ్లాడు. లాక్‌డౌన్‌ కారణంగా అతడు అక్కడే చిక్కుకుపోయాడు. ఆందోళనకు గురైన రజియా బేగం బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డికి పరిస్థితిని వివరించారు. ఆయన ఇచ్చిన అనుమతి పత్రంతో 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు సోమవారం ఉదయం స్కూటీపై బయల్దేరారు. మంగళవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నారు. కుమారుడితో కలిసి అదే స్కూటీపై తిరుగు ప్రయాణమై బుధవారం మధ్యాహ్నానికి కామారెడ్డి చేరుకున్నారు. కొడుకును చూడాలనే తపన తనను అంత దూరం వెళ్లేలా చేసిందని రజియా తెలిపారు. చాలా చోట్ల పోలీసులు ఆపారని, బోధన్‌ ఏసీపీ ఇచ్చిన పత్రాన్ని చూపించడంతో అనుమతించారని వివరించారు.

Updated Date - 2020-04-10T06:31:39+05:30 IST