కేరళలో మళ్లీ లాక్ డౌన్

ABN , First Publish Date - 2021-07-14T21:56:15+05:30 IST

కరోనా సెకండ్ వేవ్‌తో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ..

కేరళలో మళ్లీ లాక్ డౌన్

తిరువనంతపురం: కరోనా కట్టడిలో కేరళను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి... కరోనా దేశంలోకి ప్రవేశించి కల్లోలం మొదలు పెట్టినప్పుడు నిపుణులు చెప్పిన మాట ఇది.. అంతెందుకు డబ్ల్యూహెచ్‌వో కూడా మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రెండు నెలలుగా అన్ని రాష్ట్రాల్లోనూ కేసులు తగ్గుతున్నా.. కేరళలో మాత్రం తగ్గడంలేదు. పెరుగుతూనే ఉన్నాయి. కరోనా సెకండ్ వేవ్‌తో కేరళ చిగురుటాకులా వణికిపోతోంది. కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ వైరస్ ఉధృతి ఆగడంలేదు. దీంతో రెండు రోజులపాటు పూర్తి స్థాయిలో లాక్ డౌన్ విధించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 17, 18 తేదీల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.


కేరళలో ప్రస్తుతం 196 స్థానిక సంస్థలు ఉన్నాయి. కేసుల నమోదును బట్టి వాటిని మూడు భాగాలుగా విభజించింది. వాటి ఆధారంగా ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు గురువారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది. కేరళలో జికా వైరస్ అలజడి సృష్టిస్తోంది. రాష్ట్రంలో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం కొత్తగా మరో మూడు కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 22కు చేరినట్లు కేరళ ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. ఓ ప్రైవేటు ఆస్పత్రికి చెందిన 38ఏళ్ల వైద్యుడికి జికా సోకినట్లు తెలిపారు. వైరస్ సోకినవారిలో 35ఏళ్ల వ్యక్తితోపాటు 41 ఏళ్ల మహిళ కూడా ఉన్నట్లు వెల్లడించారు.

Updated Date - 2021-07-14T21:56:15+05:30 IST