రబీ పంటలకు అకాల వర్షాలు, లాక్డౌన్ దెబ్బ
ABN , First Publish Date - 2020-06-03T08:03:38+05:30 IST
ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు అకాల వర్షాలు, లాక్డౌన్ కారణంగా వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటులో లేకపోవడంతో తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి రబీ పంటలకు...
- తృణ, పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తి తగ్గుదల
ముంబై, జూన్ 2 : ఫిబ్రవరి, మార్చి నెలలో ప్రతికూల వాతావరణ పరిస్థితులతోపాటు అకాల వర్షాలు, లాక్డౌన్ కారణంగా వ్యవసాయ పనులకు కూలీలు అందుబాటులో లేకపోవడంతో తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి రబీ పంటలకు గట్టి దెబ్బ తగిలింది. నేషనల్ బల్క్ హ్యాండ్లింగ్ కార్పొరేషన్ వారి నివేదిక ప్రకారం గత సంవత్సరంతో పోల్చితే 2019-20లో తృణ ధాన్యాలు 1.95 శాతం, పప్పు ధాన్యాలు 2.22 శాతం, నూనె గింజలు 13.48 శాతం తగ్గినట్లు అంచనావేశారు. మన దేశంలో రబీ పంటలు గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలలో మార్చిలో, పంజాబ్, హరియాణ, ఉత్తరప్రదేశ్లలో ఏప్రిల్లో మొదలవుతాయి. సరిగ్గా రబీ సీజన్ మధ్య కాలంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది.
వ్యవసాయ పనులను లాక్డౌన్ నుంచి మినహాయించినప్పటికీ తగినంత మంది కూలీలు అందుబాటులో లేకపోవడం, రవాణా సౌకర్యం కూడా లేనందున ఆ ప్రభావం రబీ పంటలపై పడింది. అయితే తెలంగాణలో మాత్రం బియ్యం ఉత్పత్తి స్వల్పంగా 3.17 శాతం పెరుగుతుందని అంచనా వేశారు. పప్పు ధాన్యాలు, గోధుమల విషయంలో ఇక్కడ రైతుల దృష్టి మారినందున వాటి ఉత్పత్తి గత ఏడాదితో పోల్చితే 25.67 శాతం తగ్గుతుందని అంచనా. అలాగే గత ఏడాదితో పోల్చితే పప్పు ధాన్యాల ఉత్పత్తి 2.22 శాతం, మొక్కజొన్న ఉత్పత్తి 0.99 శాతం తగ్గే అవకాశం ఉంది.