మూడు గంటలు మినహా... ఇళ్లలోనే జనమంతా
ABN , First Publish Date - 2020-04-04T11:24:10+05:30 IST
జిల్లాలో 12వరోజైన శుక్రవారం లాక్ డౌన్ సంపూర్ణంగానే సాగింది. రోజు మొత్తంలో సడలింపు ఇచ్చిన ఉదయంపూట మూడుగంటలు మినహా మిగిలిన సమయం అంతా జనం ఇళ్లకే పరిమితమయ్యారు.
పట్టణాల్లో మరింత కఠినంగా
12వరోజూ సాగిన లాక్డౌన్
ఒంగోలు, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో 12వరోజైన శుక్రవారం లాక్ డౌన్ సంపూర్ణంగానే సాగింది. రోజు మొత్తంలో సడలింపు ఇచ్చిన ఉదయంపూట మూడుగంటలు మినహా మిగిలిన సమయం అంతా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. గ్రామీణ ప్రాంతాల కన్నా పట్టణాలలో లాక్డౌన్ విషయంలో ప్రజలు ఎక్కువపట్టుదలతో పాటిస్తున్నారు. ప్రత్యేకించి పాజిటివ్ కేసులు నమోదైన పట్టణాలలో ఆ ప్రభావం అధికంగాఉంది. లాక్డౌన్ వల్ల విభిన్న రంగాలకు చెందిన పేదలు, ప్రత్యేకించి పట్టణాలలో రోజువారీ పనులు చేసుకుంటేనే తప్ప పూట గడవని వారుసైతం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. కూరగాయలు, నిత్యావసరాలు,పాలు, పండ్లు ఇతరత్రా కొనుగోలు, రేషన్ సరుకులు కోసం ఉదయం 6నుంచి 9 వరకు సడలింపు ఉండగా ఆ సమయంలోనే తమ అవసరాలను ప్రజలు తీర్చుకుంటున్నారు.
అప్పుడు కూడా ఆయా దుకాణాల వద్దమినహా ఇతర చోట్ల జనసంచారం అంతగా కనిపించడంలేదు. ఉదయం పదిగంటల కల్లా పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి ఆయాప్రాంతాలు తీసుకొని జన సంచారాన్ని వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. దీంతో మిగిలిన సమయం అంతా జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. మెడికల్ దుకాణాలు తెరచి ఉంచినా అత్యవసరం అయితేనే తప్ప వాటికి కూడాజనం అంతగా వెళ్తున్న దాఖాలాలు లేవు. కాగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయిన ఒంగోలు, చీరాల, కందుకూరు, చీమకుర్తి, కనిగిరి పట్టణాల్లోని సంబంధిత పేటలలో జనసంచారాన్ని పూర్తిగా నిషేధించారు. బారికేడ్లు ఇతరత్రా పెట్టి అక్కడివారు బయటకు రాకుండా బయటివారు ఆప్రాంతానికి వెళ్లకుండా కట్టడిచేయడం కనిపించింది. .