లాక్‌డౌన్‌ బేఖాతర్‌!

ABN , First Publish Date - 2020-03-31T09:32:30+05:30 IST

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలంతా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా సరే కొంతమంది

లాక్‌డౌన్‌ బేఖాతర్‌!

అవసరం లేకున్నా రోడ్లపై తిరుగుతున్న జనాలు

పోలీసులు కేసులు పెడుతున్నా మారని తీరు

ఇలాగైతే కరోనా కట్టడి ఎలాగని పోలీసుల ఆవేదన 


విశాఖపట్నం, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే ప్రజలంతా బయట తిరగకుండా ఇంట్లోనే ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా సరే కొంతమంది నగరవాసులు పట్టించుకోవడం లేదు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నా చాలామంది ధోరణిలో మార్పు రావడం లేదు. దీంతో నగర రోడ్లపై గత వారం రోజులుగా కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తే... సోమవారం మాత్రం అందుకు భిన్నంగా కనిపించింది.


పోలీసులు వాహనదారులను ఆపి ఏ పనిమీద బయటకు వెళుతున్నారని ప్రశ్నిస్తే, కొంతమంది తమకు తెలిసిన పోలీస్‌ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలకు ఫోన్‌ చేసి తమను విడిచిపెట్టాలంటూ పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో పోలీసులు కూడా తమకెందుకు వచ్చిన తలనొప్పి అని మొక్కుబడిగా తనిఖీ చేసి పంపేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినప్పటికీ ప్రజల్లో అంకితభావం లేకపోతే రాబోయే పెను ప్రమాదాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మధురవాడ ప్రాంతంలో కొంతవరకు వాహనాల రద్దీ తక్కుగానే ఉన్నప్పటికీ హనుమంతవాక నుంచి గాజువాక వరకూ హైవేపైనా, ఇటు మద్దిలపాలెం నుంచి పాత పోస్టాఫీ్‌స వరకూ నగరంలోని ప్రధాన రోడ్లపై వాహనాలు సాధారణంగానే కనిపించడం తమను ఆశ్చర్యానికి గురిచేసిందని పోలీసులు వాపోతున్నారు. ఇప్పటికైనా నగరవాసులు ఇళ్లకే పరిమితమై కరోనా బారినపడకుండా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

Updated Date - 2020-03-31T09:32:30+05:30 IST