సానా సతీశ్బాబుపై ఎల్వోసీ రీకాల్
ABN , First Publish Date - 2022-01-29T09:07:44+05:30 IST
సానా సతీశ్బాబుపై ఎల్వోసీ రీకాల్
సీబీఐని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 28: మాసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీకి సంబంధించిన అవినీతి కేసులో వ్యాపారవేత్త సానా సతీశ్బాబుపై జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్(ఎల్వోసీ)ను రీకాల్ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సీబీఐని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్ ముక్తా గుప్తా శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల ప్రారంభంలోనే ఈ కేసులో వాదనలు ముగియగా న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. తనపై ఎల్వోసీ జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ సతీశ్బాబు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో తాను నిందితుడిని కాదని, విచారణకు సహకరించడం లేదన్న ఫిర్యాదు కూడా తనపై లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖురేషీ, వ్యాపారవేత్త ప్రదీప్ కోనేరుపై జారీ అయిన ఎస్వోసీలను ట్రయల్ కోర్టు, హైకోర్టు ఇప్పటికే రద్దు చేశాయన్నారు. 2017, ఫిబ్రవరి 17న ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత తాను 15, 16సార్లు విదేశాలకు వెళ్లి, భారత్కు తిరిగొచ్చానన్నారు. తనపై ఏకపక్షంగా ఎల్వోసీ జారీ చేయడం చట్టవిరుద్ధం, దుర్మార్గమని ఆరోపించారు. సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ఈ కేసులో సతీశ్బాబు పాత్ర ఉందని, ఆయన దేశం విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఎల్వోసీ జారీ చేశామని తెలిపారు. ఆయన ఆస్తుల వివరాలను సీబీఐకి సమర్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.