‘పనిముట్ల కొనుగోలుకు రైతు గ్రూపులకు రుణాలు’
ABN , First Publish Date - 2021-06-24T05:42:18+05:30 IST
ఈ ఏడాది డీసీసీబీ టర్నోవర్ రూ.2100 కోట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు సీఈవో డివీఎస్ శర్మ తెలిపారు.
నర్సీపట్నం అర్బన్, జూన్ 23 : ఈ ఏడాది డీసీసీబీ టర్నోవర్ రూ.2100 కోట్ల లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకు సీఈవో డివీఎస్ శర్మ తెలిపారు. చెట్టుపల్లి పీఏసీఎస్ను బుధవారం సందర్శించిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు రూ.1100 కోట్ల డిపాజిట్ల సేకరిం చామన్నారు. రూ.850 కోట్ల పంట రుణాలు మంజూరు చేసినట్టు చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఐదుగురు రైతులతో కూడిన గ్రూపులకు వ్యవసాయ పనిముట్ల కొనుగోలుకు రూ.15 లక్షల వరకూ రుణాలు మంజూరు చేయనున్నామని వివరించారు. వీటిని మూడు విడతల్లో అందిస్తామని, దీనిని వచ్చే నెల ఎని మిదో తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. మండల కేంద్రంలో ఒక పీఏసీఎస్ ఏర్పాటు చేయనున్నామన్నారు. ప్రస్తుతం 30 పీఏసీఎస్లు ఉండగా, కొత్తగా మరో ఐదింటిని రెండు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. డీసీసీబీ నర్సీపట్నం బ్రాంచ్ మేనేజర్ ఎల్.కె.ఎం.నాయుడు, సొసైటీ సీవో పిట్ల చలపతి పాల్గొన్నారు.