ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ!

ABN , First Publish Date - 2020-06-05T09:59:24+05:30 IST

ప్రాథమిక విద్య బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ పాఠశాలల మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ..

ప్రభుత్వ పాఠశాలల్లో ఎల్‌కేజీ, యూకేజీ!

ఏడాది పాటు పూర్వ ప్రాథమిక విద్యాబోధన

ఈ విద్యాసంవత్సరం నుంచే అమలుకు సన్నాహాలు

ఆన్‌లైన్‌ బోధనకు 24 గంటల పాటు పనిచేసే టీవీ చానెల్‌

ఏడాదికి విద్యార్థికి పది మాస్కులు, 6 శానిటైజర్‌ బాటిళ్లు

కేంద్రానికి నివేదించిన సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారులు


(కాశీబుగ్గ): ప్రాథమిక విద్య బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రైవేట్‌ పాఠశాలల మాదిరి ప్రభుత్వ పాఠశాలల్లోనూ పూర్వ ప్రాథమిక విద్య(ప్రీ ప్రైమరీ) ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులోకి తెచ్చినా ఫలితం లేకపోయింది. బోధన మెరుగుపడకపోవడం, ఇతరత్రా కారణాలతో అంగన్‌వాడీ కేంద్రాల నుంచి ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు మరలుతున్నారు. ఈ నేపథ్యంలో ఎల్‌కేజీ, యూకేజీ వంటివి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా పిల్లలకు ఏడాది పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించనుంది. తరువాతి ఏడాది నేరుగా ఒకటో తరగతిలో ప్రవేశం కల్పించనుంది. రాష్ట్రవ్యాప్తంగా 3,400 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను అందుబాటులోకి తేవడానికి సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. జిల్లాలో 2,373 ప్రాథమిక పాఠశాలలకుగాను.. సుమారు 250కు పైగా పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానం ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది.


ప్రభుత్వం ఇప్పటికే నాడు-నేడు ద్వారా పాఠశాలల్లో వసతులు మెరుగుపరిచే పనిలో ఉంది. అమ్మఒడి నగదు సాయం, మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం, ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశం తదితర వాటితో సర్కారీ పాఠశాలలను బలోపేతం చేస్తోంది. తాజాగా పూర్వ ప్రాథమిక విద్యను ఈ విద్యాసంవత్సరం నుంచే అందుబాటులోకి తెచ్చేందుకు సన్నద్ధమవుతోంది. వీరికి బోధనకుగాను కొంతమంది నిరుద్యోగ యువతను కాంట్రాక్ట్‌ ప్రతిపాదికన నియమించనున్నట్లు తెలుస్తోంది. 


సరికొత్తగా ముందుకు..

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పాఠాల బోధనకు ప్రత్యేక టీవీ చానల్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు సమగ్ర శిక్ష అభియాన్‌ యోచిస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నెలల తరబడి పాఠశాలలు మూతపడ్డాయి. విద్యార్థులు బోధనకు దూరంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ బోధన చేస్తున్నాయి. ప్రభుత్వ విద్యకు సంబంధించి అటువంటి పరిస్థితి లేదు. కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు శ్రద్ధ చూపిస్తున్నా మార్గం లేదు. ఈ పరిస్థితుల్లో టీవీ ద్వారా ఆన్‌లైన్‌ బోధన అందుబాటులోకి తెస్తే ఎంతో ప్రయోజనమని సమగ్రశిక్ష అభియాన్‌ రాష్ట్రస్థాయి అధికారులు యోచిస్తున్నారు. టీవీ చానల్‌ ఏర్పాటుకు రూ.3కోట్లు, నిర్వహణకు ఏటా రూ.40 లక్షలు అవసరమని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు.


కరోనా నివారణ జాగ్రత్తల్లో భాగంగా విద్యార్థులకు ఏడాదికి పది మాస్కులు, ఆరు శానిటైజర్‌ బాటిళ్లు అవసరమని గుర్తించారు. తరగతి గదులు శుభ్రం చేయడానికి ప్రత్యేక నిధులు పాఠశాలలకు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు అదనంగా యూనిఫారం అందించాలని సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై కొద్దిరోజుల్లో స్పష్టమైన ఆదేశాలు రానున్నట్టు అధికారులు చెబుతున్నారు. 


ప్రాథమిక విద్య బలోపేతం ..శ్రీనివాస్‌రావు, ఎంఈవో, పలాస

ప్రాథమిక విద్య బలోపేతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అభియాన్‌ సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్య అందుబాటులోకి వస్తే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశముంది. పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన వారికి నేరుగా ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. దీనిపై స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నుంచి మౌఖిక ఆదేశాలు రావాల్సి ఉంది.  


Updated Date - 2020-06-05T09:59:24+05:30 IST