కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదు: హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-17T02:01:30+05:30 IST

హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 18 ఏళ్ల ఒక యువతి, 20 ఏళ్ల ఒక యువకుడు పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఇంట్లో నుంచి పారిపోయారు. కొద్ది రోజుల బయట నివసించి ఇంకాస్త వయసు రాగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు..

కొద్ది రోజులు కలిసుంటే సహజీవనం అయిపోదు: హైకోర్టు

చండీగఢ్: కొద్ది రోజులు కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని సహజీవనంగా గుర్తించలేమని పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు గురువారం అభిప్రాయపడింది. ఇంట్లో నుంచి పారిపోయిన ఓ యువ జంట హైకోర్టును ఆశ్రయించింది. వీరి వాదనలు విన్న అనంతరం జస్టిస్ మనోజ్ నేతృత్వంలోని ధర్మాసనం పై విధంగా అభిప్రాయపడింది.


హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 18 ఏళ్ల ఒక యువతి, 20 ఏళ్ల ఒక యువకుడు పెద్దలు తమ పెళ్లికి ఒప్పుకోలేదని ఇంట్లో నుంచి పారిపోయారు. కొద్ది రోజుల బయట నివసించి ఇంకాస్త వయసు రాగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే వారికి అమ్మాయి కుటుంబం నుంచి బెదిరింపులు వస్తుండడంతో హైకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ యువ జంట వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అంతే కాకుండా వారికి 25,000 రూపాయల జరిమానా విధించింది.


‘‘సమాజంలో కొద్ది సంవత్సరాలుగా తీవ్ర మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రత్యేకించి అత్యుత్సాహమైన యువత వల్ల అనేక మార్పులు వస్తున్నాయి. వాళ్లు స్వేచ్ఛ పేరుతో తల్లిదండ్రుల సాంగత్యాన్ని విడిచిపెట్టి నచ్చిన వ్యక్తితో జీవించడానికి బయల్దేరుతున్నారు. మళ్లీ వారి జీవితానికి కుటుంబాల నుంచి ముప్పు వస్తుందని రక్షణ కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు’’ అని ధర్మాసనం పేర్కొంది.

Updated Date - 2021-12-17T02:01:30+05:30 IST