ఆరు నెలల క్రితం మహిళ డెలివరీ.. కోమాలోకి వెళ్లడంతో కాలేయ మార్పిడి.. సక్సెస్..
ABN , First Publish Date - 2022-02-08T16:37:04+05:30 IST
ఆరు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చి, కామెర్లతో కోమాలోకి వెళ్లిన ఓ మహిళకు
హైదరాబాద్ సిటీ : ఆరు నెలల క్రితం బిడ్డకు జన్మనిచ్చి, కామెర్లతో కోమాలోకి వెళ్లిన ఓ మహిళకు వైద్యులు కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు. సోమవారం పేస్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. హన్మకొండకు చెందిన మహిళ(28)కు ఆరు నెలల క్రితం ప్రసవం జరిగింది. అప్పటికే ఆమె కాలేయ సంబంధిత వైఫల్యంతో (ఆక్యూట్ హెప్టిక్ ఫెయిల్యూర్) ఇబ్బంది పడుతోంది. పది రోజులుగా స్థానికంగా మందులు వాడగా తీవ్ర అనారోగ్యానికి గురైంది.
కామెర్లు ముదరడంతో కోమాలోకి వెళ్లింది. మెరుగైన చికిత్స కోసం నగరంలోని పేస్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెకు తరచూ మూర్ఛ రావడంతో వెంటిలేటర్పై చికిత్స అందించడం ప్రారంభించారు. ఆస్పత్రి చీఫ్ హెపటాలజిస్ట్ డాక్టర్ గోవింద్ వర్మ, డాక్టర్ ఫణికృష్ణ ఆమెకు కాలేయ మార్పిడి చేయాలని నిర్ణయించి డయాలసిస్ చేశారు. ఇన్ఫెక్షన్ నియంత్రణలోకి వచ్చాక కాలేయ మార్పిడికి సిద్ధం చేశారు. సోదరుడు కాలేయం దానం చేశాడు. కాలేయ మార్పిడి తర్వాత 12 గంటల్లో ఆమె కోలుకుందని, ఏడు రోజుల్లో కామెర్లు తగ్గిపోయినట్టు వైద్యులు తెలిపారు.