మృత్యుంజయుడే..కానీ కంటతడి పెట్టించాడు..

ABN , First Publish Date - 2020-12-02T16:25:31+05:30 IST

కళ్లు మూసుకుని నిద్రపోతుండగానే ఘోర ప్రమాదం జరిగింది.

మృత్యుంజయుడే..కానీ కంటతడి పెట్టించాడు..

రంగారెడ్డి జిల్లా: కళ్లు మూసుకుని నిద్రపోతుండగానే ఘోర ప్రమాదం జరిగింది. కళ్లు తెరిచి చూసేసరికి తనవాళ్లందరూ రక్తమోడుతూ కనిపించారు. ఏం జరిగిందో తెలియదు. ఎలా జరిగిందో తెలియదు. అర్థం చేసుకోలేని వయసులో ఉన్న ఆ బాలుడు బిక్కచచ్చిపోయాడు. షాక్‌తో బిగుసుకుపోయాడు. జరిగిన ఘోరాన్ని చూసి అర్థం కాకపోయినా ఏదో జరగరానిది జరిగిందని తెలుస్తోంది. ఆ పసిప్రాణం అల్లాడిపోయింది. వాహనంతో నిద్రపోతున్న బాలుడు కళ్లు తెరిచి చూసేసరికి ప్రమాదం జరిగిపోయింది. ఘటనా స్థలంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. మృతులంతా రక్తపుమడుగులో ఉన్నారు. భయంతో అమాయకంగా మొహం పెట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్న బాలుడిని చూసి స్థానికులు సయితం కంటతడి పెట్టారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బుధవారం తెల్లవారుజామున చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారు బోర్‌వెల్‌ను ఢీకొనడంతో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో డ్రైవర్‌ సహా ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. మృతులంతా హైదరాబాద్‌ తాడ్‌బండ్‌ వాసులుగా గుర్తించారు. మల్కాపూర్ గేట్‌ సమీపంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో 10 మంది ప్రయాణికులున్నారు. మృతులు ఆసిఫ్ ఖాన్(50), మహేష్ షనియా(18) నజియ బేగం(45), నజియ భాను(36) హర్ష (28) చిన్నారి హర్ష భాను(6)గా గుర్తించారు. 

Updated Date - 2020-12-02T16:25:31+05:30 IST