స్కీమ్ మూసేస్తే లిస్టింగ్ తప్పనిసరి
ABN , First Publish Date - 2020-05-21T06:56:07+05:30 IST
మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైనా స్కీమ్లను మూసివేయాలనుకుంటే ఆ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన వారు తమ యూనిట్లు విక్రయించుకుని నగదుగా మార్చుకునేందుకు మార్గం కల్పిస్తూ...
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఏవైనా స్కీమ్లను మూసివేయాలనుకుంటే ఆ ఫండ్లలో పెట్టుబడి పెట్టిన వారు తమ యూనిట్లు విక్రయించుకుని నగదుగా మార్చుకునేందుకు మార్గం కల్పిస్తూ వాటిని గుర్తింపు పొందిన స్టాక్ ఎక్జ్ఛేంజిలో లిస్టింగ్ చేయాలని సెబీ నిబంధన విధించింది. అలాగే ఏ స్కీమ్ మూసివేయాలనుకుంటున్నదీ ముందస్తుగా లిస్టింగ్ చేయతలపెట్టిన స్టాక్ ఎక్స్ఛేంజికి సమాచారం అందించాలి. ఈ మేరకు సెబీ బుధవారం ఒక సర్కులర్ జారీ చేస్తూ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపింది.
ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇటీవల ఆరు డెట్ స్కీమ్లను మూసివేసిన నేపథ్యంలో లావాదేవీలను కట్టుదిట్టం చేసేందుకు సెబీ ఈ చర్య తీసుకుంది. ఏఎంసీల నుంచి సమాచారం అందుకున్న అనంతరం ఆ స్కీమ్లను ఎలా మూసివేయాలి, వాటిని ఎలా లిస్టింగ్ చేయాలి వంటి అంశాలన్నీ సెబీతో చర్చించి ఆయా స్టాక్ ఎక్స్ఛేంజిలు నిర్ణయిస్తాయి. ఆర్డర్ పెట్టడం, అమలు, చెల్లింపులు, సెటిల్మెంట్ వంటి అంశాలతో సవివరమైన విధివిధానాలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలిపింది. లిస్టింగ్ సదుపాయం కల్పించాలనుకునే స్టాక్ ఎక్స్ఛేంజిలు వాటి విధివిధానాలను వారం రోజుల్లోగా తెలియచేయాల్సిందిగా సెబీ కోరింది.