చింతమడక.. ఈ పేరు గుర్తుందా.. లాక్డౌన్ అమలుతో ఇక్కడేం జరుగుతుందో తెలిస్తే...
ABN , First Publish Date - 2020-04-03T20:23:47+05:30 IST
సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో మద్యం ఏరులై పారుతోంది. లాక్డౌన్ ప్రకటించిన...
చింతమడకలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు
ప్రజాప్రతినిధి ఇంట్లోనే మద్యం నిల్వలు?
సిద్దిపేట రూరల్: సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడకలో మద్యం ఏరులై పారుతోంది. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి మద్యం ఎక్కడా లభించకపోయినా గ్రామంలో మాత్రం విచ్చలవిడిగా దొరుకుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. మద్యాన్ని ఎమ్మార్పీ ధరకన్నా మూడురెట్లు అదనంగా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని రాఘవాపూర్లో కనకదుర్గ వైన్ యజమానులు చింతమడక గ్రామస్తులు కావడం వల్లే గ్రామంలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని మహిళలు ఆరోపిస్తున్నారు.
కరోనాతో ఇప్పటికే ఉపాధి లేక ఇబ్బందులు పడుతుంటే దానికి తోడు మద్యం కోసం మగవారు అప్పులు చేస్తున్నారని ఆవేదన చెందారు. ఇద్దరు పోలీసుల సహకారంతో రాత్రుళ్లు రాఘవాపూర్ మద్యం దుకాణం నుంచి సుమారు రూ. నాలుగు లక్షల విలువైన మద్యాన్ని దుకాణం పక్కనే ఉన్న గోదాం నుంచి తరలించినట్లు సమాచారం.
మద్యాన్ని చింతమడక గ్రామానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇంట్లోనే నిల్వ చేసినట్లు తెలుస్తోంది. ఆ ప్రజాప్రతినిధికి కూడా వైన్ షాప్లో భాగస్వామ్యం ఉందని, అందుకే మద్యాన్ని తన ఇంట్లో నిల్వ చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత శాఖ అధికారుల సహకారం లేకుండా మద్యం విక్రయించడం సాధ్యం కాదని కొందరు మద్యం వ్యాపారులు అంటున్నారు.
చింతమడకలో మద్యం విక్రయించిన వ్యక్తిని ఫోన్ ద్వారా వివరణ కోరగా విక్రయించింది వాస్తవమేనని గురువారం మధ్యాహ్నం వరకు మద్యం ఉన్నదని చెప్పారు. లాక్ డౌన్ ప్రకటిస్తారని ముందే తెలిసి కొంత మొత్తాన్ని తమ వద్ద నిల్వ చేసుకున్నామని వివరించారు. మద్యాన్ని అధిక ధరలకు విక్రయించలేదని తెలిపారు. సంబంధిత శాఖ సీఐని వివరణ కోరగా లాక్డౌన్ ఉన్నందున మద్యం విక్రయించే అవకాశం లేదన్నారు. ఈ విషయంపై విచారణ జరిపి చర్యలు చేపడతామని తెలిపారు.