తునిలో భారీగా మద్యం స్వాధీనం?
ABN , First Publish Date - 2020-10-31T06:21:53+05:30 IST
పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న కిల్లిబడ్డీ నుంచి భారీగా తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే షాపు యజమానిని కాకినాడ తరలించారు.
అధికారుల అదుపులో నిందితుడు
తుని, అక్టోబరు 30: పట్టణంలోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న కిల్లిబడ్డీ నుంచి భారీగా తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే షాపు యజమానిని కాకినాడ తరలించారు. అక్కడ అతన్ని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపెట్టాడు. స్థానిక అధికారులకు నెలనెలా మామ్మూళ్లు అందించి వ్యాపారం చేస్తున్నట్లు చెప్పాడు. డబ్బులు ఇచ్చినా దాడులు చేయడమేమిటని తిరిగి అధికారులనే ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో స్థానిక అధికారుల మామ్మూళ్ల బాగోతంపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు సమాచారం. ఈ మేరకు విచారణ ప్రారంభించినట్లు తెలిసింది. స్థానిక అధికారుల ప్రమేయంపై మూడు రోజులుగా పట్టణంలో విచారణ జరుపుతున్నారు. శుక్రవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ తుని వచ్చి విచారణ నిర్వహించారు. స్థానిక అధికారులు మద్యం అక్రమ వ్యాపారాన్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విచార ణాధికారులు గుర్తిం చారు. ఈ మేరకు స్థానిక ఎక్సైజ్ సీఐ, ఎస్ఐతో పాటు డ్రైవర్, కానిస్టేబుల్పై వేటుకు రంగం సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు చర్యలుంటాయని భావిస్తున్నారు. తుని వచ్చిన ఎక్సైజ్ సూపరింటెండెంట్ను ఈ విషయమై ప్రశ్నించగా త్వరలో అన్ని విషయాలు తెలుపుతామన్నారు. పట్టణంలో ఇతర ప్రాంతాల్లో తెలంగాణ మద్యం విక్రయాలపై అధికారులు నిఘా ఉంచినట్లు తెలిసింది.