అవయవదానంతో 8 మంది జీవితాల్లో వెలుగులు
ABN , First Publish Date - 2021-12-06T09:17:04+05:30 IST
ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన మహిళ ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది.
- రోడ్డు ప్రమాదంలో మహిళ బ్రెయిన్డెడ్
- దాతృత్వం చాటుకున్న కుటుంబ సభ్యులు
చిట్యాల రూరల్, డిసెంబరు 5: ప్రమాదంలో గాయపడి బ్రెయిన్డెడ్ అయిన మహిళ ఎనిమిది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపనుంది. ఆమె అవయవాలను కుటుంబ సభ్యులు దానం చేయడం ద్వారా ఇది సాకారం కాబోతోంది. యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్నేపల్లికి చెందిన అశ్విని(25), కానిస్టేబుల్ అయిన ఆమె భర్త ఏరుకొండ శ్రీను తొమ్మిది నెలల పాపతో కలిసి హైదరాబాద్లో ఉంటున్నారు. ఇటీవల అత్తగారి ఊరైన వెలిమినేడుకు రాగా, ద్విచక్రవాహనంపై భర్త, పాపతో కలిసి వలిగొండ మండలం వేములకొండకు బయలుదేరారు. మార్గమధ్యంలో వాహనం పై నుంచి అశ్విని, చిన్నారి కిందపడిపోయారు. అశ్విని తలకు గాయం కావడంతో కోమాలోకి వెళ్లింది. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్డెడ్గా నిర్ధారించారు. ఈ విషాద సమయంలోనూ మానవతా దృక్ఫథంలో స్పందించిన శ్రీను కుటుంబ సభ్యులు అశ్విని అవయవాలను దానం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. జీవన్దాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అశ్విని కళ్లు, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, పెద్దపేగు, ప్యాంక్రియాసి్సను వైద్యులు సేకరించారు.