బావను హత్య చేసిన బావమరిదికి యావజ్జీవ కారాగార శిక్ష
ABN , First Publish Date - 2022-03-03T12:05:53+05:30 IST
బావను హత్య చేసిన బావమరిదికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ ...
హైదరాబాద్ సిటీ/అమీర్పేట : బావను హత్య చేసిన బావమరిదికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ హైదరాబాద్ మెట్రోలిపాలిటన్ సెషన్ కోర్టు జడ్జి తిరుమలదేవి తీర్పు చెప్పారు. సీఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకేగూడ వేంకటేశ్వర ఆలయ సమీపంలో నివసించే దూసరి చంద్రశేఖర్గౌడ్(35)సా్ఫ్టవేర్ ఉద్యోగి. 2013 డిసెంబర్ 1 నుంచి అతడు కనిపించకుండా పోవడంతో బాలానగర్ వినాయకనగర్లో ఉంటున్న తల్లి రాములమ్మ ఎస్ఆర్నగర్ పోలీసులకు అదేనెల 3వ తేదీన ఫిర్యాదు చేశారు. చంద్రశేఖర్గౌడ్ మొదటి భార్య సోదరుడైన మునిరాజ్ అరుణ్కుమార్గౌడ్ ఫార్మసీ ల్యాబ్లో పనిచేసే యూనిస్ అనే వ్యక్తి సహకారంతో మధుసూదన్రావు వద్ద కారు అద్దెకు తీసుకొని డిసెంబర్ 1న చంద్రశేఖర్గౌడ్ను కిడ్నాప్ చేశారు.
మార్గమధ్యంలో నోటికి మత్తుమందు అద్దిన కర్చీప్ పెట్టారు. దీంతో అతడికి స్పృహ తప్పడంతో గోనెసంచిలో కుక్కి వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లారు. కొట్టేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు అక్కడి పోలీసులు ఎస్ఆర్నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇందుకు కారకుడు అరుణ్కుమార్గౌడ్ అని నిర్ధారణకు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారించగా తనకు సహకరించిన ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పాడు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి అరుణ్కుమార్గౌడ్కు సహకరించిన ఇద్దరికి యావజ్జీ కారాగార శిక్ష విధిస్తూ 2017లో తీర్పు చెప్పారు. అరుణ్కుమార్గౌడ్ మెట్రోలిపాలిటన్ సెషన్ కోర్టుకు అప్పీల్ చేసుకున్నాడు. కేసును విచారించిన న్యాయమూర్తి అతడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారు.