భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు
ABN , First Publish Date - 2022-09-14T16:34:36+05:30 IST
భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 7 వేల జరిమానా విధిస్తూ మల్కాజిగిరి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా
హైదరాబాద్/ఏఎస్రావునగర్: భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 7 వేల జరిమానా విధిస్తూ మల్కాజిగిరి కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. వివరాలు ఇలా ఉన్నాయి.....కుషాయిగూడ, సాయినగర్ కాలనీకి చెందిన లింగాల రమేష్(40) 2016 జూలై 4న తన భార్య అనిత (24) ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడు. తీవ్ర గాయాలైన అనిత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. తన భర్త అనుమానంతో శారీరకంగానూ, మానసికంగానూ వేధించేవాడని, మద్యం మత్తులో ఒంటిపై కిరోసిన్ పోసి తగులబెట్టాడని మరణ వాంగ్మూలంలో పేర్కొంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న కుషాయిగూడ పోలీసులు ఆధారాలు సేకరించి కోర్టుకు చార్జిషీట్ సమర్పించారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన కోర్టు రమే్షకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. సాక్ష్యాలు కోర్టుకు సమర్పించి నిందితుడికి శిక్ష పడేలా చర్య తీసుకున్న కుషాయిగూడ పోలీసులను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, డీసీపీ రక్షితా కే మూర్తి అభినందించారు.