హత్యకేసులో నిందితుడికి జీవిత ఖైదు
ABN , First Publish Date - 2022-01-22T05:20:53+05:30 IST
మహిళను హత్యచేసిన కేసులో నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.300 జరిమానా విధిస్తూ సత్తుపల్లిలోని న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది.
అశ్వారావుపేట రూరల్, జనవరి 21: మహిళను హత్యచేసిన కేసులో నిందితుడికి జీవితఖైదుతో పాటు రూ.300 జరిమానా విధిస్తూ సత్తుపల్లిలోని న్యాయస్థానం శుక్రవారం తీర్పు వెలువరించింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పినపాక మండలం చింతలపాడుకు చెందిన ముచ్చిక పోశమ్మ స్థానికంగా గల పరిశ్రమలో దినసరి కూలీగా పని చేస్తోంది. ఒడిశా రాష్ట్రం గణపతి జిల్లా రాయఘడ్ బ్లాక్ వలకభద్రకు చెందిన సవరం రమేష్ అనే వ్యక్తి కూడా అక్కడే పని చేస్తున్నాడు. ఇదే క్రమంలో 2017 నవంబరు 20న పోశమ్మ పరిశ్రమ సమీపంలో శవంగా కనిపింది. అప్పట్లో సీఐ అబ్బయ్య అనుమానాస్పద కేసుగా నమోదు చేశారు. అనంతరం ప్రస్తుత సీఐ ఉపేందరరావు ఆధ్వర్యంలో విచారణ నిర్వహించారు. విచారణలో రమేష్ సదరు మహిళ పోశమ్మతో గొడవపడి హత్య చేసినట్లుగా గుర్తించారు. విచారణ అనంతరం రమేష్ను అరెస్ట్ చేసి సత్తుపల్లి కోర్టులో హాజరుపరిచారు. సాక్షులను విచారించిన అనంతరం నాలుగో అదనపు జిల్లా జడ్జి సాయిభూపతి రమేష్కు జీవితఖైదుతో పాటు రూ.300 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు సీఐ ఉపేందరరావు తెలిపారు.