ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం 25% వృద్ధి
ABN , First Publish Date - 2020-07-31T07:30:10+05:30 IST
ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం 2019-20లో 25.2 శాతం పెరిగి రూ.1,77,977 కోట్లకు చేరింది.
ముంబై: ఎల్ఐసీ కొత్త ప్రీమియం ఆదాయం 2019-20లో 25.2 శాతం పెరిగి రూ.1,77,977 కోట్లకు చేరింది. జీవితబీమా మార్కెట్లో పాలసీల పరంగా 75.90 శాతం, తొలి ఏడాది ప్రీమియం పరంగా 68.74 శాతం వాటాతో ఎల్ఐసీ ఇప్పటికీ ఆధిపత్య స్థానం కొనసాగిస్తోంది. పెన్షన్, గ్రూప్ సూపర్ యాన్యువేషన్ వ్యాపార విభాగం రూ.లక్ష కోట్ల మైలురాయిని దాటి రూ.1,26,696.21 కోట్ల కొత్త బిజినెస్ ప్రీమియం ఆదాయాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోల్చితే ఇది 39.86 శాతం అధికం. గత ఏడాది మొత్తం మీద 12.42 శాతం వృద్ధితో ఎల్ఐసీ 3,79,062.56 కోట్ల మొత్తం ప్రీమియం ఆదాయం పొందింది, స్థూల ఆదాయం రూ.6,15,882.94 కోట్లకు పెరిగింది.