ఎల్జీ విస్తరణకు అనుమతుల్లేవ్
ABN , First Publish Date - 2020-05-29T07:49:08+05:30 IST
విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విస్తరణకు పర్యావరణ అనుమతులు లేవని కేంద్ర పర్యావరణశాఖ, పరిశ్రమలశాఖలు..
హైకోర్టుకు నివేదించిన కేంద్రం.. తదుపరి విచారణ నేటికి వాయిదా
అమరావతి, మే 28 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ విస్తరణకు పర్యావరణ అనుమతులు లేవని కేంద్ర పర్యావరణశాఖ, పరిశ్రమలశాఖలు.. ఏపీ హైకోర్టుకు నివేదించాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్ ద్వారా విడుదలైన విషవాయువు కారణంగా 12మంది మృతి చెందడాన్ని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు సుమోటోగా విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఎదుట గురువారం మరోమారు విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్ జోస్యుల భాస్కరరావు వాదనలు వినిపిస్తూ.. గతంలో సమర్పించిన వివరాలకు మరికొంత అదనపు సమాచారాన్ని కూడా జోడించి కోర్టు ముందుంచామని వివరించారు. దీంతో ఆ డాక్యుమెంట్లను క్రమపద్ధతిలో ఉంచి, తీసుకురావాలని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.