ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందాం

ABN , First Publish Date - 2021-10-18T06:15:09+05:30 IST

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జి.వెంకటరావు పిలుపునిచ్చారు.

ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందాం
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న వెంకటరావు

పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జి.వెంకటరావు

కూర్మన్నపాలెం, అక్టోబరు 17:  విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు జి.వెంకటరావు పిలుపునిచ్చారు. కూర్మన్నపాలెంలో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 248వ రోజుకు చేరుకున్నాయి. ఈ శిబిరంలో వెంకటరావు మాట్లాడుతూ ఈ నెల 19 నాటికి దీక్షలు 250 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో 250 మంది కార్మికులతో 25 గంటలు పాటు నిరాహార దీక్ష చేస్తున్నట్టు వెల్లడించారు. తాము ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో  రాజకీయ పార్టీలు, కార్మికులు, యువత, మహిళలు, రచయితలు, కవులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ఈ ఉద్యమంలో అందరూ కుటుంబ సభ్యులతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కుకు సొంత గనులు కేటాయించి, ప్రభుత్వరంగంలో కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. ఈ శిబిరంలో పలువురు ఉక్కు ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-18T06:15:09+05:30 IST