అమరవీరుల త్యాగాలను స్మరించుకుందాం
ABN , First Publish Date - 2022-07-04T06:18:11+05:30 IST
దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాజీ బ్రిగేడియర్ రాజీవ్ మీనన్ అన్నారు.
మాజీ బ్రిగేడియర్ రాజీవ్ మీనన్
చిత్తూరు, జూలై 3: దేశ సరిహద్దుల్లో ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని మాజీ బ్రిగేడియర్ రాజీవ్ మీనన్ అన్నారు. ఆదివారం స్థానిక బైపాస్ రోడ్డులోని బ్యాన్స్ హోటల్లో 28 మద్రాసు రెజిమెంట్ మాజీ సైనికుల 46వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వచ్చిన సైనికాధికారులు, మాజీ బ్రిగేడియర్ రాజీవ్మీనన్, కల్నల్ రాయ్, కల్నల్ శ్రీకుమార్ మాట్లాడుతూ 46 సంవత్సరాలుగా ఏటా బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, త్రివేండ్రం తదితర ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది చిత్తూరులో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 28 మద్రాసు రెజిమెంట్లో వివిధ పోరాటాల్లో అమరులైన 66 మంది వీరసైనికులను స్మరించుకోవాలన్నారు. దేశ భద్రతలో క్రియాశీలకంగా ఉంటున్న సైనికులు జాతీయ, కామన్ వెల్త్ పోటీల్లోనూ పతకాలు సాధించారని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ మాజీ సైనికులు దేశానికి చేసిన సేవలను స్మరించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి మాజీ సైనికుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.