కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను ఎండగడదాం

ABN , First Publish Date - 2021-03-01T07:41:00+05:30 IST

విద్యారంగంలో కేంద్రప్రభుత్వం తీసు కొస్తున్న ఏకపక్ష నిర్ణయాలను ఎండగడదామని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు.

కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలను ఎండగడదాం
సమావేశంలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి

ఎస్‌ఎఫ్‌ఐ ప్లీనరీ ముగింపులో ఎమ్మెల్సీ యండపల్లి 


తిరుపతి(విద్య), ఫిబ్రవరి 28: విద్యారంగంలో కేంద్రప్రభుత్వం తీసు కొస్తున్న ఏకపక్ష నిర్ణయాలను ఎండగడదామని ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో భారతవిద్యార్థి ఫెడరేషన్‌ రెండ్రోజుల రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రపాలపై పెత్తనంకోసం కేంద్రం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించకుండానే ఏకపక్షనిర్ణయాలు తీసుకుని సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రవేశపెడుతూ మూఢత్వాన్ని ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలోని సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని ఆరోపించారు. 14 ఏళ్లుగా వర్సిటీలో అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా, ఏ ప్రభుత్వమూ భర్తీ చేయలేదని వాపోయారు. ఎస్‌ఎఫ్‌ఐ మాజీ జాతీయ నాయకుడు వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వరంగ సంస్థలన్నీ అమ్మకానికి పెడుతూ నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును కార్పొరేట్‌ సంస్థలకు అమ్మాలనుకోవడం దుర్మార్గపు చర్యకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌, కార్యదర్శి రమేశ్‌, మాధవ్‌, సూర్యచంద్ర, శివరాజు, రాజా, వినోద్‌, సురేశ్‌, మనోజ్‌, బాబావలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T07:41:00+05:30 IST