ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతాం

ABN , First Publish Date - 2022-08-12T06:41:15+05:30 IST

కర్ణాటక అటవీశాఖతో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు.

ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతాం
ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల అటవీశాఖాధికారులతో సమావేశమైన పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి

కుప్పం పరిసరాల్లో ఏనుగుల సంచార నియంత్రణకు చర్యలు

పీసీసీఎఫ్‌ మధుసూదన్‌రెడ్డి


తిరుపతి(నేరవిభాగం), ఆగస్టు 11: కర్ణాటక అటవీశాఖతో కలిసి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని రాష్ట్ర ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటివ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల ఉన్నతస్థాయి ఫారెస్ట్‌ అధికారుల సమావేశం తిరుపతి సీసీఎఫ్‌ కార్యాలయంలో గురువారం జరిగింది. సమావేశం తర్వాత పీసీసీఎఫ్‌ మీడియాతో మాట్లాడారు. అరుదైన అటవీ సంపద సంరక్షణ, వన్యప్రాణుల పరిరక్షణకోసం రెండు రాష్ట్రాల అటవీశాఖ అధికారులు సంయుక్త కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. ముఖ్యంగా ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్టు చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లోని డీఎ్‌ఫవోలతో ప్రత్యేక వాట్సప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి, సమన్వయంతో పనిచేస్తామన్నారు. అలాగే ఏనుగుల సంచారంపై మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు. కృష్ణగిరి, కోలారు, కుప్పం పరిసర ప్రాంతాల్లో ఏనుగుల సంచారాన్ని నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కందకాలతోపాటు సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినట్టు వివరించారు. 

Updated Date - 2022-08-12T06:41:15+05:30 IST