కలిసి నడుద్దాం!

ABN , First Publish Date - 2022-05-25T08:19:34+05:30 IST

రక్షణ బంధంలో భారత్‌-అమెరికా కీలక మైలురాయిని చేరుకున్నాయి.

కలిసి నడుద్దాం!

ప్రపంచ భద్రతపై మోదీ-బైడెన్‌ కీలక నిర్ణయం


‘కంబైన్డ్‌ మిలిటరీ ఫోర్సెస్‌’లో భారత్‌కు చోటు

ఇండియాకు 3,877 కోట్ల సైనిక సాయం?

వచ్చే కాలం క్వాడ్‌దే!: ప్రధాని నరేంద్ర మోదీ

ఇండో-పసిఫిక్‌ నైసర్గిక స్థితి మారితే ఊరుకోం

చైనాకు క్వాడ్‌ సభ్యదేశాల సూటి హెచ్చరిక

సదస్సు సమీప గగనతలంలోకి యుద్ధ విమానాలు

సమావేశ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత


కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రధాని మోదీ విశేష కృషి చేశారు. ప్రజాస్వామ్యయుతంగా నియంత్రణ చర్యలు అమలు చేశారు. ప్రజాస్వామ్య శక్తిసామర్థ్యాలను ఆయన విజయం రుజువు చేసింది. చైనా, రష్యాల్లోని నియంతృత్వ నాయకత్వాలే ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలవన్న భ్రమలను మోదీ కరోనా విజయం పటాపంచలు చేసింది. చైనా, భారత్‌ వైశాల్యపరంగా దాదాపు సమానంగానే ఉన్నా.. కరోనా కట్టడిలో ఇండియా మాత్రమే విజయం సాధించింది.

- అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ 


టోక్యో, మే 24: రక్షణ బంధంలో భారత్‌-అమెరికా కీలక మైలురాయిని చేరుకున్నాయి. రెండు దేశాల జాతీయ భద్రతా మండళ్ల నడుమ క్రిటికల్‌-ఎమర్జింగ్‌ టెక్నాలజీల్లో పరస్పర సహకారానికి ప్రధాన భాగస్వామ్యం నెలకొల్పుకోవాలని నిర్ణయించాయి. మంగళవారం జపాన్‌ రాజధాని టోక్యోలో నాలుగు దేశాల ‘క్వాడ్‌’ సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, భారత ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రగతిశీల, స్వేచ్ఛాయుత, స్నేహపూర్వక, సురక్షిత ప్రపంచం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ‘రెండు దేశాల వ్యూహాత్మక బంధం.. నిజమైన విశ్వాస భాగస్వామ్యం. ప్రపంచ శాంతి సుస్థిరతలకు, మానవాళి సంక్షేమానికి ఉభయ దేశాల మైత్రి ఉపకరిస్తుందన్న విశ్వాసం నాకుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఉభయ దేశాలూ కలిసి చేయాల్సింది చాలా ఉందని బైడెన్‌ అన్నారు.  భారత్‌-అమెరికా వ్యాక్సిన్‌ యాక్షన్‌ కార్యక్రమాన్ని 2027 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.


కాగా.. బహ్రెయిన్‌లో అమెరికా సారథ్యంలోని ‘కంబైన్డ్‌ మిలిటరీ ఫోర్సె్‌స’లో భారత్‌కు అసోసియేటెడ్‌ సభ్యత్వం కల్పిస్తున్నట్లు వైట్‌హౌస్‌ ప్రకటించింది. మేకిన్‌ ఇండియా, ఆత్మనిర్భర్‌ కార్యక్రమాలకు అనుగుణంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీలో భారత్‌తో భాగస్వామ్యానికి కలిసి రావాలని అమెరికా పరిశ్రమలకు మోదీ పిలుపిచ్చారు. వీరిద్దరి భేటీతో ఫలప్రదమైన ఫలితాలు వచ్చాయని.. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి ఊపునిచ్చాయని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. మోదీ-బైడెన్‌ చర్చల అనంతరం రెండు దేశాలు కీలక ప్రకటన  చేశాయి. కీలక టెక్నాలజీల్లో సహకారానికి రెండు దేశాల జాతీయ భద్రతా మండళ్ల ఆధ్వర్యంలో ‘భారత్‌-అమెరికా ఇనీషియేటివ్‌ ఆన్‌ క్రిటికల్‌-ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ (ఐసెట్‌)’ను ప్రారంభిస్తున్నట్లు తెలిపాయి. దీనిద్వారా కృత్రిమ మేధ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, 5జీ, 6జీ, బయోటెక్‌, అంతరిక్షం, సెమీకండక్లర్ల రంగాల్లో ప్రభుత్వాలు, విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య మరింత సన్నిహిత బంధం ఏర్పడుతుందని 

వెల్లడించాయి. టీకాలు, ఇతర ఆరోగ్య టెక్నాలజీల అభివృద్ధికి ఉమ్మడి బయోమెడికల్‌ రీసెర్చ్‌ కార్యక్రమా న్ని కొనసాగించేందుకు ఏనాడో కుదుర్చుకున్న వ్యాక్సిన్‌ యాక్షన్‌ ప్రోగ్రాంను 2027 వరకు పొడిగించాలని నిర్ణయించాయి.


ఈ ఏడాది కృత్రిమ మేధ, డేటా సైన్స్‌ నుంచి వ్యవసాయం, ఆరోగ్యం, వాతావరణ రంగాల వరకు 25 ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టులకు సహకరించేందుకు భారత్‌లోని 6 టెక్నాలజీ ఇన్నొవేషన్‌ హబ్స్‌లో భాగస్వామి కావాలని నిర్ణయించినట్లు అమెరికా పే ర్కొంది. అలాగే ఆర్థిక భద్రతలో సముద్రతల రక్షణ, సముద్ర మార్గాలది కీలక భూమిక అని.. ఈ దిశగా ఇండో-పసిఫిక్‌ భాగస్వామ్యం నెలకొల్పుకోవడం ముదావహమని బైడెన్‌, మోదీ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడితో భేటీ ఫలవంతమైందని.. రక్షణ, వాణిజ్యం, పెట్టుబడు లు సహా పరస్పర ప్రయోజనకర అంశాల్లో విస్తృత చర్చలు జరిపామని మోదీ ట్విటర్‌లో తెలిపారు. కాగా.. క్వాడ్‌ సదస్సు సందర్భంగా ఆస్ట్రేలియా కొత్త ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌, జపాన్‌ ప్రధాని ఫ్యుమియో కిషిదాతోనూ మోదీ వేర్వేరుగా సమావేశమయ్యారు. అలాగే, ముగ్గురు జపాన్‌ మాజీ ప్రధానులను కలిశారు.


మంచి కోసం పాటుపడే బృందం..

వచ్చేకాలం క్వాడ్‌దేనని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ యవనికపైకి వచ్చిన కొద్ది కాలంలోనే అమిత ప్రభావం చూపాయంటూ క్వాడ్‌ సభ్యదేశాలను అభినందించారు. మంచి కోసం పాటుపడే బృందంగా క్వాడ్‌ ప్రతిష్ఠ ఇప్పుడు మరింత పెరిగిందన్నారు. జపాన్‌ రాజధాని టోక్యోలో మంగళవారం మొదలైన క్వాడ్‌ నాలుగు దేశాల సదస్సులో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశా రు. జో బైడెన్‌, కిషిదా, ఆంథోనీ ఆల్బెనీ్‌సతో మోదీ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. సదస్సులో తక్కిన దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దుశ్చర్యను గట్టిగా గర్హించ గా, మోదీ మాత్రం ఆ అంశం జోలికి వెళ్లలేదు. కొవిడ్‌ నియంత్రణ, భవిష్యత్‌ కార్యాచరణ మేరకే చర్చల్లో పాల్గొన్నారు. ప్రధానిగా ప్రమాణం చేసి 24 గంటలు గడవకముందే సదస్సుకు హాజరైన ఆస్ట్రేలియా కొత్త పీఎం ఆంథోనీ ఆల్బెనీ్‌సని ఆయన అభినందించారు.


కాగా, కొవిడ్‌పై కంటే ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండించడానికి బైడెన్‌ ఈ సదస్సులో ఎక్కువ సమ యం తీసుకున్నారు. ‘మన ప్రయాణంలో ఇదొక చీకటి ఘడియ’ అని బైడెన్‌ వ్యాఖ్యానించారు. కలిసి నడు స్తూ స్వేచ్ఛాయుత, సరళీకృత వాణిజ్యవ్యవస్థగా ‘ఇం డో-పసిఫిక్‌’ను తీర్చిదిద్దుతామని అందరం గట్టి సంక ల్పం తీసుకుందామని జపాన్‌ ప్రధాని కిషిదా ప్రతిపాదించారు. భౌగోళిక రాజకీయాల్లో పెరిగిన చైనా పశుబలానికి ప్రతిక్రియగా ఇండో-పసిఫిక్‌ను బలోపేతం చేద్దామని ఆస్ర్టేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బెనీస్‌ సూ చించారు. అలాగే.. వాతావరణ మార్పులపై నాలుగు దేశాలూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.


దీనిపై తక్షణం దృష్టి సారించాలని, ఈ సమస్యపై అనుసరించాల్సిన పద్ధతులు, ముప్పును తగ్గించే చర్యలు.. అనే రెండు దృక్పథ సంబంధ అంశాల ఆధారంగా కార్యాచరణకు దిగాలని తీర్మానించాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంత పరిధిలో మౌలిక సదుపాయాల కల్పన రంగంలో మరింత ఎక్కువగా సహకరించుకోవాలని, ఇందుకు ఐదేళ్లలో 50 బిలియన్‌ డాలర్లు వెచ్చించాలని తీర్మానించాయి. క్వాడ్‌ సభ్యదేశాల పరిధిలో ఫెలోషిప్‌ విధానాన్ని అమలు చేయాలని కూడా సదస్సులో నిర్ణయించారు. సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ (స్టెమ్‌) రంగాల్లో పరిశోధనలు చేసే 25 మందికి ఏటా ఫెలోషి్‌పలు ఇస్తారు. కాగా.. ఇండో-పసిఫిక్‌ ప్రాంత నైసర్గిక యథాతథస్థితికి భంగం కలిగించే, రెచ్చగొట్టే చర్యలను అంగీకరించేది లేదని చైనాను హెచ్చరించింది.


సదస్సు సమీపంలోకి యుద్ధ విమానాలు..

క్వాడ్‌ సదస్సు జరుగుతున్న ప్రాంతానికి అతి సమీ ప గగనతలంలోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు వచ్చాయని జపాన్‌ ప్రదాని కిషిదా చేసిన ప్రకటన ఉద్రిక్తత రేపింది. అయితే.. వాటిని ఎదుర్కొనేందుకు తమ జెట్‌లు తయారుగా ఉన్నాయని ఆయన చెప్పడంతో అందరూ తేలికపడ్డారు. సదస్సు సమీప ప్రాం తాలు, జపాన్‌లోని వ్యూహాత్మక స్థావరాలకు దగ్గరగా తమ యుద్ధవిమానాలు వెళ్లినట్టు చైనా అధికార పత్రిక ‘గ్లోబల్‌ టైమ్స్‌’ కూడా అంగీకరించింది. అయితే, సైనిక విన్యాసాల్లో ఇవి భాగమని సమర్థించుకుంది. 


ఉగ్రవాదంపై క్వాడ్‌దీ భారత్‌ బాటే..

భారత్‌లో ఉగ్రవాదులు జరిపిన ముంబై ముట్టడి, పఠాన్‌కోట్‌ దాడులను క్వాడ్‌ సభ్యదేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని క్వాడ్‌ సదస్సు వేదికగా సంయుక్త ప్రకటనను నేతలు విడుదల చేశారు. ఉగ్రవాద చర్యలు, హింసాత్మక తీవ్రవాద ధోరణులు ఏ రూపంలోనూ సమర్థనీయం కావని తేల్చిచెప్పారు. తమ భూభాగాన్ని ఉగ్రవాదులు వాడుకునేందుకు అనుమతించడం, ఉగ్రవాద నేతలకు ఆశ్రయమివ్వడం, ఆర్థిక, ఆయుధ, సైనికపరమైన అండదండలు అందించడం వంటి చర్యలు గర్హనీయమని ప్రకటించారు. ప్రత్యేకంగా పేరు చెప్పకున్నా ఈ వ్యాఖ్యలు పాకిస్థాన్‌ను ఉద్దేశించినవేనని విదేశాంగ వర్గాలు అంటున్నాయి. 


కొవిడ్‌ యుద్ధంలో మోదీ విజయం: బైడెన్‌

కరోనా మహమ్మారి నియంత్రణకు ప్రధాని మోదీ చేసిన కృషిని బైడెన్‌ ‘క్వాడ్‌’ సమావేశంలో ప్రశంసించారు. ప్రజాస్వామ్యయుతంగా నియంత్రణ చర్యలు అమలు చేశారని కొనియాడారు. సుదీర్ఘ విధాన నిర్ణాయక ప్రక్రియల్లేకుండా చైనా, రష్యాల్లోని నియంతృత్వ నాయకత్వాలే ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకోగలవన్న భ్రమలను మోదీ కరోనా విజయం పటాపంచలు చేసిందని తెలిపారు. చైనా, భారత్‌ వైశాల్యపరంగా సమానంగానే ఉన్నా.. కరోనా కట్టడిలో ఇండియా మాత్రమే విజయం సాధించిందని బైడెన్‌ పేర్కొన్నట్లు తెలిపారు. భారత్‌ ఇతర దేశాలకు వ్యాక్సిన్లు సరఫరా చేయడంతో వైరస్‌ నియంత్రణ సాధ్యమైందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్‌ కూడా అన్నారు. వ్యాక్సిన్‌ సరఫరాలో భారత్‌ పాత్రను జపాన్‌ ప్రధాని ఫ్యుమిమో కిషిదా కూడా కొనియాడారు. ‘క్వాడ్‌ వ్యాక్సిన్‌ ఇనీషియేటివ్‌’ ద్వారా భారత వ్యాక్సిన్లు అందుకున్న థాయ్‌లాండ్‌, కాంబోడియా కృతజ్ఞతలు తెలిపాయన్నారు. 

Updated Date - 2022-05-25T08:19:34+05:30 IST