ఆ పాఠ్య పుస్తకాలను రద్దుచేసే ప్రశ్నే లేదు

ABN , First Publish Date - 2022-06-08T17:54:47+05:30 IST

రాష్ట్రంలో ఇప్పటికే ముద్రితమైన పాఠ్యపుస్తకాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ తేల్చి చెప్పారు.

ఆ పాఠ్య పుస్తకాలను రద్దుచేసే ప్రశ్నే లేదు

- అవసరమైతే కొద్దిపాటి మార్పులు 

- ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ 

- 9న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన 


బెంగళూరు, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటికే ముద్రితమైన పాఠ్యపుస్తకాలను ఉపసంహరించుకునే ప్రశ్నే లేదని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ తేల్చి చెప్పారు. సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలోని పాఠ్యాంశాలు, తమ ప్రభుత్వ హయాంలోని పాఠ్యాంశాలను సరి పోల్చుకునే అవకాశాన్ని ప్రజలకే వదిలివేస్తున్నామన్నారు. పాఠ్యాంశాల విషయంలో కాంగ్రెస్‌ అనవసర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ఒకవేళ సబ్జెక్టుల్లో లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకుంటామని పేర్కొన్నారు. వివాదం పులుముకున్న పాఠ్యాంశాలను వెబ్‌సైట్‌లో ఉంచి ప్రజాభిప్రాయం కోరతామని తెలిపారు. 9వ తరగతి సోషియల్‌ సైన్స్‌ పుస్తకంలో రాజ్యాంగ నిర్మాత అనే పదం పొరపాటున వదిలేశారని, దీన్ని మళ్లీ చేరుస్తున్నామన్నారు. అలాగే బసవణ్ణకు సంబంధించిన రెండు వాక్యాలను తిరిగి చేరుస్తున్నామని వివరించారు. ఇవి మినహా మిగిలిన పాఠాలలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలనుంచి సూచనలు వస్తే రోహిత్‌ చక్రతీర్థ కమిటీ తొలగించిన పాఠ్యాంశాలను మళ్లీ చేర్చేందుకు తమకు అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టతతో ఉందన్నారు. చిన్నారుల మనసులను కలుషితం చేసేలా బీజేపీ పాఠ్యపుస్తకాల సవరణ పేరిట సాంస్కృతిక అత్యాచారం చేస్తోందని కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మండిపడ్డారు. చక్రతీర్థ కమిటీ బీజేపీ సిద్ధాంతపరమైన పాఠాలను పాఠ్యాంశాలుగా చేర్చిందన్నారు. ఇందుకు నిరసనగా ఈనెల 9న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విధానసౌధ వద్ద గాంధీ విగ్రహం వద్ద పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరసన చేపడతారన్నారు. పాఠ్యపుస్తకాలపై కాంగ్రెస్‌ అభ్యంతరాలతోపాటు పలు మఠాలు, దళిత సం ఘా లు కూడా ఆక్రోశం వ్యక్తం చేస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. 

Updated Date - 2022-06-08T17:54:47+05:30 IST