పాఠ్యపుస్తకాల వివాదంపై.. దిగొచ్చిన సర్కారు

ABN , First Publish Date - 2022-06-29T18:02:35+05:30 IST

పాఠ్యపుస్తకాలలో ‘చక్రతీర్థ’ కమిటీ చేపట్టిన పెనుమార్పులతో ఇటు సొంతపార్టీలోనూ, అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న

పాఠ్యపుస్తకాల వివాదంపై.. దిగొచ్చిన సర్కారు

- సవరణలకు ఓకే

- ఎనిమిది మార్పులతో తాజా ఉత్తర్వులు 


బెంగళూరు, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): పాఠ్యపుస్తకాలలో ‘చక్రతీర్థ’ కమిటీ చేపట్టిన పెనుమార్పులతో ఇటు సొంతపార్టీలోనూ, అటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ప్రభుత్వం ఓ మెట్టు కిందకు దిగక తప్పలేదు. రచయిత రోహిత్‌ చక్రతీర్థ అధ్యక్షతన పాఠ్యపుస్తకాల సంస్కరణ కమిటీ చేసిన పలు మార్పులను ఉపసంహరించుకుంటూ విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ పేరు ముందు రాజ్యాంగనిర్మాత అనే పదాన్ని కొనసాగించడంతోపాటు కువెంపు, కనకదాసు పాఠాలను యథాతథంగా కొనసాగించనున్నారు. అయితే బసవణ్ణ పాఠాలలో కొద్దిపాటి మార్పులు చేయనున్నారు. ఇప్పటికే 80శాతం పాఠ్యపుస్తకాల ముద్రణ పూర్తయ్యిందని, ఎలాంటి సమస్యలేకుండా చూడాలని అధికారులకు సూచన చేసినట్లు ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ వెల్లడించారు. బెంగళూరులో ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠ్యపుస్తకాల సవరణకు సంబంధించి మరో కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. ప్రత్యేకించి కనకదాసు చరిత్ర యథాతథంగా కొనసాగించాలంటూ కనకగురు పీఠాధిపతి నిరంజనానందపురి స్వామీజీ సోమవారం ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించిన సంగతి తెలిసిందే. దాదాపు 8 సవరణలను పాఠ్యపుస్తకాలలో తలపెట్టినట్లు వెల్లడించిన అధికారులు వీ టిని వెబ్‌సైట్‌లలోనూ ఉంచుతున్నామన్నారు. తదుపరి వెల్లడయ్యే అభ్యంతరాల ఆధారంగా మరిన్ని మార్పులు చేసేందుకు సిద్ధమని తెలిపారు. ఈ వివాదాన్ని సాధ్యమైనంత త్వరగా తెరదింపాలంటూ ముఖ్యమంత్రి స్వయంగా విద్యాశాఖకు సూచించినట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏంటంటే టిప్పుసుల్తాన్‌కు సంబంధించిన పాఠాల విషయంలో మాత్రం తగ్గేదేలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై పునరాలోచన లేదని తొలగించిన పాఠాలను చేర్చేది లేదని స్పష్టం చేసింది.

Updated Date - 2022-06-29T18:02:35+05:30 IST