సీఎం KCR సర్కార్కు అభివృద్ధి ముఖ్యం.. కులాలు కాదు: Gutta
ABN , First Publish Date - 2022-05-25T15:03:43+05:30 IST
సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి అభివృద్ధి ముఖ్యమని.. కులాలు ముఖ్యం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
నల్గొండ: సీఎం కేసీఆర్ (KCR) ప్రభుత్వానికి అభివృద్ధి ముఖ్యమని.. కులాలు ముఖ్యం కాదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhendar Reddy) స్పష్టం చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... గత రెండు మాసాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆర్ధికంగా ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతమని, రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధిలో ముందుండే రాష్ట్రాలను కేంద్రం ప్రోత్సహించాలని ఆయన అన్నారు.
కొన్ని శక్తులు స్వార్థం కోసం కులాల పేరుతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్కు తప్ప ఏ పార్టీకి అధికారం ఇచ్చినా తెలంగాణ కుక్కలు చింపిన విస్తారే అవుతుందని అన్నారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra modi) హైదరాబాద్ రానున్నారని... విభజన చట్టంలో ఉన్న ప్రతీ అంశాన్ని అమలు చేయాలని ప్రధానిని గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.