విద్యుత్ సవరణ బిల్లుపై భగ్గు
ABN , First Publish Date - 2022-08-10T05:10:58+05:30 IST
కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెడుతున్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
వామపక్షాల నిరసన
పత్రాల దహనం
కేంద్రం తీరుపై మండిపాటు
పార్వతీపురంటౌన్, ఆగస్టు9 : కేంద్ర ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెడుతున్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని సీపీఎం, సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పట్టణంలోని బెలగాం సీపీఎం కార్యాయం ఎదుట విద్యుత్ సవరణ బిల్లు పత్రాలను దహనం చేశారు. కేంద్రం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ అంశంపై రాష్ట్రాలతో సంప్రదించకపోవడం దారుణమన్నారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కును కాలరాస్తోందని ఆరోపించారు. 2017 ఏప్రిల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బిల్లును అమోదించడం అన్యాయమన్నారు. అన్ని వర్గాలు వ్యతిరేకించినా కేంద్ర సర్కారు పట్టించుకోకపోవడం విచారకరమని తెలిపారు. రైతులు, సామాన్య ప్రజానీకానికి కష్టాలు తెచ్చిపెట్టే ఈ బిల్లును మేధావులు, విద్యావంతులు వ్యతిరేకించాలన్నారు. వామపక్ష నాయకులు రమణ, మన్మథరావు తదితరులు పాల్గొన్నారు.